
తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ద్వారా చిత్ర నిర్మాణ సంస్థలు, ఎగ్జిబిటర్లు ఆర్జిస్తున్న అదనపు ఆదాయంపై సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలు పెంచిన సినిమాల కలెక్షన్లలో ఏకంగా 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇది పాత నిబందనే కానీ నిర్మాతలు ఫాలో కాకపోవడంతో మరోసారి ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ తాజా ఆదేశాల ప్రకారం, టికెట్ రేట్ల పెంపు ద్వారా వచ్చిన అదనపు కలెక్షన్లో 20 శాతం మొత్తాన్ని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGFDC) తో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఖాతాల్లో తప్పనిసరిగా జమ చేయాల్సి ఉంటుంది. సినిమా రంగంలో నిరంతరం శ్రమిస్తున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ 20 శాతం మొత్తాన్ని నేరుగా ఎగ్జిబిటర్ల (థియేటర్ యజమానుల) నుంచి వసూలు చేసి సంబంధిత ఖాతాలకు జమ చేసే పూర్తి బాధ్యతను ఆయా చిత్రాల నిర్మాతలకే అప్పగించారు.
ఇటీవల విడుదలైన, అలాగే విడుదలకు సిద్ధమవుతున్న పలు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులకు ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా పెద్ది’, ‘రాజాసాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ ‘అఖండ 2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ ధరల పెంపు ద్వారా సమకూరిన కలెక్షన్ల నుంచి ఈ 20 శాతం వాటాను వెంటనే చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సాధారణంగా పెద్ద సినిమాల బడ్జెట్ రికవరీ కోసం టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పిస్తుంటాయి. అయితే, ఆ పెంచిన ధరల భారం ప్రేక్షకులపై పడుతున్న తరుణంలో, అందులోంచి వచ్చే ఆదాయాన్ని సినిమా రంగానికి వెన్నెముకగా నిలిచే కార్మికుల సంక్షేమానికి మళ్లించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.