
Rhea Chakraborty: దేశవ్యాప్తంగా 2020లో సంచలనం సృష్టించింది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం. ఈ సంఘటనని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా వినిపించిన పేరు రియా చక్రవర్తి. రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ప్రభావం తన జీవితాన్నే కాదు, తన కుటుంబ భవిష్యత్తునూ మార్చేసిందని నటి రియా చక్రవర్తి భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. తన కెరీర్ ఒక్కసారిగా ఆగిపోయిందని, అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే కేవలం తన ఇంటిపేరు కారణంగానే తన తండ్రి కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయారని ఆమె వెల్లడించారు. తాజాగా ఫరా ఖాన్ వ్లాగ్లో పాల్గొన్న రియా, 2020 తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు.
ఫరా ఖాన్తో మాట్లాడుతూ.. తన జీవితాన్ని మళ్లీ గాడిలో పెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి రియా చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తికి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. సిటీలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్గా ఆయనకు పెద్ద ఉద్యోగం వచ్చిందని, కానీ ఆయన ఇంటిపేరు తెలుసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయిందని చెప్పారు. ఆసుపత్రి యాజమాన్యం మీరు రియా చక్రవర్తి తండ్రి కదా అని చెప్పి ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేమని తెలిపిందని రియా వెల్లడించారు. ఆ ఒక్క మాట తమ కుటుంబానికి ఎంతటి దెబ్బగా మారిందో ఆమె వివరించారు. ఈ సంఘటన తనకు ఇప్పటికీ బాధ కలిగిస్తుందని, సుశాంత్ ప్రభావం సినిమా రంగానికే కాకుండా ఫ్యామిలీపైనా పడిందని ఆమె చెప్పారు.
రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి. భారత సాయుధ దళాల వైద్య విభాగంలో డాక్టర్గా ఆయన సేవలందించారు. సుదీర్ఘ అనుభవం ఉన్నప్పటికీ, తన చుట్టూ నెలకొన్న వివాదం కారణంగానే ఆ ఉద్యోగ అవకాశం చేజారిందని రియా ఆరోపించారు. ఫరా ఖాన్ వ్లాగ్లో ఇంద్రజిత్ కూడా కొద్దిసేపు కనిపించడం విశేషం. 2020లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత జరిగిన పరిణామాలు రియా జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆ కేసుకు సంబంధించిన డ్రగ్స్ దర్యాప్తులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్టు చేసింది. అప్పుడు ఎదుర్కొన్న విమర్శలు తన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయని గతంలోనే ఆమె వెల్లడించారు. తాను పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్తో బాధపడ్డానని కూడా ఆమె చెప్పారు.
ఈ కేసులో తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. 2025 మార్చిలో సుశాంత్ మరణంపై సీబీఐ దాఖలు చేసిన నివేదికలో రియా చక్రవర్తి, ఆమె కుటుంబంపై క్లీన్ చిట్ ఇచ్చింది. సుశాంత్ డెత్ పై కుట్ర ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు లభించలేదని పేర్కొంది. అయితే సుశాంత్ ఎలా చనిపోయాడనేది ఒక జావాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పుడు రియా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ‘ది ట్రేటర్స్ 2’ షో లో కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ ప్రజల ముందుకు వస్తున్న ఈ దశలో, గతంలో తమ కుటుంబం చెల్లించిన మూల్యం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చకు దారితీశాయి.