Reading Time: 2 minutes

మధ్యతరగతి ప్రజలే ప్రభుత్వానికి ATMలా మారారు.. ఆదాయపు పన్ను రద్దు చేయాలి : BJP నేత షెహజాద్ పూనావాలా

Caption of Image.

బీజేపీ నేత షెహజాద్ పూనావాలా దేశ మధ్యతరగతి ప్రజల సమస్యలపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పన్నులు, టోల్ ఛార్జీలు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రతిఫలం అందుతోందా అని సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను వెల్లడించారు.

షెహజాద్ పూనావాలా ‘ది మేనిఫెస్టో’ అనే సరికొత్త సోషల్ మీడియా ఇనిషియేటివ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం, ఇబ్బందులను ప్రస్తావించారు. దేశంలో మధ్యతరగతి ప్రజలను కేవలం ప్రభుత్వానికి డబ్బులు చెల్లించే ఒక “ఏటీఎం” లాగా చూస్తున్నారని విమర్శించారు. ఆదాయపు పన్ను, పరోక్ష పన్నులు, టోల్ ట్యాక్సులు భారీగా చెల్లిస్తున్నప్పటికీ.. ఆ స్థాయికి తగిన ప్రజా సేవలు మాత్రం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

BJP పదవికి రాజీనామా:
తన సోషల్ మీడియా వీడియో విడుదల చేసిన మరుసటి రోజే షెహజాద్ పూనావాలా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జూలై 30వ తేదీనే తాను రాజీనామా సమర్పించినట్లు వెల్లడించారు. తన వ్యక్తిగత ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేయడం గమనార్హం.

యూరప్‌తో పోలిక – మౌలిక వసతుల లేమి:
యూరోపియన్ దేశాలతో సమానంగా పన్నులు చెల్లిస్తున్న భారతీయులకు.. అక్కడి మాదిరిగా నాణ్యమైన జీవన ప్రమాణాలు అందుతున్నాయా అని పూనావాలా ప్రశ్నించారు. దేశంలో అధ్వానమైన రోడ్లు, నాసిరకం పాఠశాలలు, కుప్పకూలుతున్న మౌలిక వసతులు, పేపర్ లీకేజీలు, అవినీతి, జవాబుదారితనం కొరవడటం, కాలుష్యమైన గాలి, నీరు వంటి సమస్యలతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రైవేటు సేవలపై పెనుభారం:
మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం ప్రైవేటు సేవలపై పూర్తిగా ఆధారపడాల్సి వస్తోందని పూనావాలా ఎత్తిచూపారు. పిల్లల చదువుల కోసం ప్రైవేటు పాఠశాలలను, తల్లిదండ్రుల వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించడం అనివార్యంగా మారిందని తెలిపారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్య ఏ ఒక్క ప్రత్యేక ప్రభుత్వానికో, ఒక రాజకీయ పార్టీకో పరిమితమైనది కాదని పూనావాలా స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి భారతీయ మధ్యతరగతి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్య ఇదని అభిప్రాయపడ్డారు.

ALSO READ : ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే ఆసుపత్రిలో చేర్చండి

పన్నుల తగ్గింపునకు పిలుపు:
దేశంలోని సాలరీడ్ క్లాస్ పన్నుల భారం విపరీతంగా ఉందని పూనావాలా అన్నారు. మధ్యతరగతిపై పన్నులను తగ్గించాలని, ఆదాయపు పన్ను స్లాబ్‌లను పెంచాలని డిమాండ్ చేశారు. పన్ను చెల్లింపుదారులు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా, పారదర్శకంగా ఖర్చు చేయాలని అభిప్రాయపడ్డారు.

©️ VIL Media Pvt Ltd.