
గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాల్గో రోజు ఆటలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక సీనియర్ బ్యాటర్, 36 ఏళ్ల దినేష్ చండీమాల్ ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. నాలుగో రోజు తొలి సెషన్లో బావుండ్రీ వద్ద బంతిని నిరోధించే క్రమంలో డైవ్ చేయడంతో ఆయన కుడి భుజం, మెడ భాగంలో బలమైన దెబ్బ తగిలింది. గ్రౌండ్లోకి వచ్చిన శ్రీలంక జట్టు ఫిజియో, వైద్యులు ప్రాథమికంగా పరిశీలించినప్పటికీ నొప్పి తీవ్రంగా ఉండటంతో ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం ముందస్తు జాగ్రత్త చర్యగా చండీమాల్ను స్కానింగ్ నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ (SLC) ప్రకటన విడుదల చేసింది. వైద్య నివేదికలు వచ్చాకే ఆయన గాయం తీవ్రతపై స్పష్టత రానుంది. 93 టెస్టుల్లో 16 శాతకాలతో 6,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన చండీమాల్కు ఈ మ్యాచ్లో పెద్దగా కలిసి రాలేదు. తొలి ఇన్నింగ్స్లో ఆయన కేవలం 4 పరుగులకే నిరాశపరిచారు.
మరోవైపు నాల్గో రోజు లంచ్ సమయానికి టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్గా నిరాశపరచగా, కెఎల్ రాహుల్ (35), తొలి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు దేవదత్ పడిక్కల్ (44) బాధ్యతాయుతంగా ఆడి రెండో వికెట్కు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ (8) పరుగులు మాత్రమే చేసి మరోసారి విఫలమయ్యాడు. ప్రస్తుతం భారత్ మొత్తంగా 294 పరుగుల సురక్షితమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకుముందు భారత్ చేసిన 462 పరుగుల భారీ స్కోరుకు సమాధానంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే ఆలౌట్ అయింది. లంక జట్టులో సోనాల్ దినుషా (110) శతకం చేయగా, నిరోషన్ డిక్వెల్లా (80) రన్స్ చేశారు. భారత బౌలర్లు మ్యాచ్పై పూర్తి పట్టు సాధించడంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లోనే 178 పరుగుల కొండంత ఆధిక్యం దక్కింది.