Reading Time: < 1 minute
జర్రుంటే ప్రాణం పోయేది..! రాత్రంతా ఫోన్ ఛార్జింగ్.. ఉదయాన్నే ఊహించని సంఘటన..

మొబైట్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోయిన ఓ యువకుడికి ఉదయం ఊహించని షాక్ ఎదురైంది. జేబులో ఉన్న ఫోన్ వేడిగా అనిపించడంతో బయటకు తీస్తుండగానే ఒక్కసారిగా పేలిపోయింది. సమయానికి ఫోన్ ను జేబులో నుంచి బయటకు తీయడంతో యువకుడికి తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలం బిజ్వార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాదారం నవీన్ కుమార్ తన మొబైల్ ఫోన్ ను రాత్రంతా ఛార్జింగ్ లో పెట్టి నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచని తర్వాత ఫోన్ ను తీసుకొని జేబులో పెట్టుకొని వ్యవసాయ పొలం వద్దకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే మార్గమధ్యలో జేబులో ఉన్న మొబైల్ ఫోన్ విపరీతంగా వేడిగా అనిపించింది. దీంతో అప్రమత్తమై ఫోన్ ఎందుకు ఇంత వేడిగా ఉందని జేబులో నుంచి బయటకు తీశాడు. అదే సమయంలో మొబైల్ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలిపోయింది.

ఈ క్రమంలో.. వెంటనే ఫోన్ ను కింద పడేయడంతో పెను ప్రమాదం తప్పింది. పేలుడు ధాటికి మొబైల్ పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఫోన్ ను జేబులో నుంచి బయటకు తీస్తున్న క్రమంలో పేలడంతో యువడకుడికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనకు రాత్రంతా ఛార్జింజ్ లో ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కిందా… లేక బ్యాటరీలో సాంకేతిక లోపం కారణంగానే పేలిందా అన్నది తెలియాల్సి ఉంది.

వీడియో చూడండి..

తాజా ఘటనతో మొబైల్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఫోన్ ను రాత్రంతా ఛార్జింగ్ లో ఉంచడం, అసాధారణంగా వేడెక్కుతున్న మొబైల్ ను జేబులో పెట్టుకోవడం వంటి విషయాల్లో జాగ్రతలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఫోన్ విపరీతంగా వేడెక్కుతున్నట్లు అనిపిస్తే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపేసి, సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..