
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయ్యప్ప స్వామి భక్తుడి జీవితంలో చోటుచేసుకునే సంఘటనల చుట్టూ తెరకెక్కుతున్న ఈ సినిమా కథ, స్క్రీన్ప్లే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన ఎన్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ సినిమా కాన్సెప్ట్, కథలో విలన్ పాత్ర గురించి ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇరుముడి’ కథకు అయ్యప్ప స్వామి భక్తి, 41 రోజుల దీక్షను ప్రధాన నేపథ్యంగా తీసుకున్నట్లు తెలిపారు. చాలా కాలంగా అయ్యప్ప స్వామిపై తనకు ప్రత్యేకమైన భక్తితో కూడిన ఆసక్తి ఉందని, ఆ ఆలోచన నుంచే ఈ కథకు బీజం పడిందని చెప్పారు. 41 రోజుల నిష్ఠను పాటించే సమయంలో ఓ వ్యక్తి జీవితంలో ఏర్పడే మార్పులు, అతడి భావోద్వేగాలు, కుటుంబ పరిస్థితులను ఈ కథలో కీలకంగా చూపించినట్లు వివరించారు.
కథలో హీరో ఓ వ్యక్తి. అతడికి తాగుడు అలవాటు ఉంటుంది. అయితే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత 41 రోజుల పాటు అతను పూర్తిగా మద్యానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితి అతడి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? అతడి బలం ఏంటి? బలహీనత ఏంటి? తన కూతురితో అతడికి ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది? అనే అంశాల చుట్టూ ఈ కథను నిర్మించినట్లు శివ నిర్వాణ తెలిపారు. 41 రోజుల టైమ్లైన్ కథకు ప్రత్యేకమైన థ్రిల్ను తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఏదో జరగబోతోందనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించే అవకాశం ఉండటంతో.. ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ను ఫ్యామిలీ డ్రామాలోకి తీసుకొచ్చినట్లు వివరించారు. సాధారణ సినిమాల తరహాలో ‘ఇరుముడి’లో ప్రత్యేకంగా ఓ విలన్ పాత్రను పెట్టాలని తనకు అనిపించలేదని శివ నిర్వాణ వెల్లడించారు. ఈ కథలో హీరో ఎదుర్కొనే సంఘటనలనే విలన్లుగా చూపించాలనే ఆలోచన తనకు వచ్చిందన్నారు.
“విలన్ను పెట్టకుండా ఇన్సిడెంట్లనే విలన్లుగా చేస్తే ఎలా ఉంటుంది?” అనే ఆలోచనతో కథను డిజైన్ చేసినట్లు చెప్పారు. ఒక గ్రామంలో జరిగే కొన్ని సంఘటనల్లో హీరో చిక్కుకోవడం, వాటి వెనుక ఉన్న అసలు విషయాలు అతడికి తెలియకపోవడం ఈ కథలో ఆసక్తికరమైన అంశంగా ఉంటుందని వెల్లడించారు. అందుకే ఈ సినిమాలో హీరోకు తెలియని ఎన్నో విషయాలు అతడి చుట్టూ జరుగుతుంటాయని, ప్రేక్షకులకు మాత్రం వాటిపై క్రమంగా క్లారిటీ వస్తుందని వివరించారు. తన సినిమా మిగతా చిత్రాల కంటే ప్రత్యేకంగా కనిపించాలన్నదే తన మొదటి లక్ష్యమని శివ నిర్వాణ తెలిపారు. కథ రాసుకునే సమయంలోనే ఇందులో మూడు ప్రధాన లేయర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అందులో మొదటి లేయర్గా హీరో అయ్యప్ప స్వామి భక్తుడు కావడం, రెండో లేయర్గా ఓ అయ్యప్ప భక్తుడి జీవితంలో ఏర్పడే అలజడి, ఆ తర్వాత అది ఎమోషనల్ టర్న్ తీసుకుని క్రైమ్, థ్రిల్లర్ అంశాల వైపు వెళ్లడం ఉంటుందని వివరించారు. ఇలా భక్తి, కుటుంబ భావోద్వేగాలు, థ్రిల్లర్, క్రైమ్ అంశాలను కలిపి ‘ఇరుముడి’ని విభిన్నమైన కథగా రూపొందిస్తున్నట్లు శివ నిర్వాణ చెప్పుకొచ్చారు. దీంతో ఈ సినిమాలో విలన్ లేకపోవడం, సంఘటనలే హీరోకు అసలు సవాళ్లుగా మారడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రేపు (21 ఆగస్టు) విడుదల కాబోతున్న ఈ చిత్రం థియేటర్స్లో ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.