Reading Time: < 1 minute
Ap Assembly 2026 Third Day Session To Discuss Tdr Bonds Fee Reimbursement

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా నేడు మూడో రోజు శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. మూడో రోజు సమావేశాల్లో పలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి పనులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. గూడూరు నియోజకవర్గంలోని యల్లసిరి కాల్వ పనులు, తిరుపతిలో టీడీఆర్‌ బాండ్ల వ్యవహారం, ఏలేరు కాల్వ బెడ్‌ రెగ్యులేటర్లు వంటి అంశాలు నేడు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి.

అలాగే ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు, గృహాల మ్యాపింగ్‌లో సవరణకు అవకాశం, గ్రీన్‌ డేటా సెంటర్‌ విధానం వంటి అంశాలపై కూడా సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రభుత్వ శాఖల్లో సాంకేతిక సిబ్బంది కొరత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాలపైనా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వనున్నారు. మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో విద్య, సాగునీరు, పట్టణాభివృద్ధి, సాంకేతిక రంగం, విద్యార్థుల సంక్షేమం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు శాసనమండలి మూడో రోజు సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. మండలిలోనూ పలు ప్రజా సమస్యలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, గృహాల మంజూరు, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళలు, నిరుద్యోగ యువతకు సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి. ఉన్నతి పథకం, గృహాల మంజూరు, ఆర్వో వాటర్‌ ప్లాంట్లు, స్త్రీ శక్తి పథకం వంటి అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య పరిస్థితులు, స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు వంటి అంశాలపైనా మండలిలో చర్చ జరగనుంది.

అకాల వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం, పర్యాటక ప్రాంతాలను ప్లాస్టిక్‌ రహిత ప్రాంతాలుగా మార్చే చర్యలు, ఆక్వా కల్చర్‌ రంగంలో నెలకొన్న సంక్షోభం వంటి అంశాలు కూడా ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావనకు రానున్నాయి. మూడో రోజు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణం, ఉపాధి వంటి పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.