Reading Time: 2 minutes
Central Cabinet Approves Ap Railway Projects Rs 13041 Crore

ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక వసతుల అభివృద్ధిపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ.13,041 కోట్ల విలువైన ఐదు భారీ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో నాలుగు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులు కాగా.. మరోటి బిహార్‌లో నాలుగు లేన్ల జాతీయ రహదారి ప్రాజెక్టు ఉంది. కేబినెట్ భేటీ అనంతరం నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

4 రైల్వే ప్రాజెక్టులకు రూ.9,450 కోట్లు

పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాలను కవర్ చేసే నాలుగు రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి కోసం మొత్తం రూ.9,450 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో మరో 410 కిలోమీటర్ల మేర అదనపు ట్రాక్‌లు అందుబాటులోకి రానున్నాయి. 2030-31 నాటికి ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆమోదం పొందిన నాలుగు ప్రాజెక్టుల్లో మూడు హౌరా-చెన్నై రైల్వే మార్గంలో, మరో ప్రాజెక్టు పారాదీప్-కటక్ సెక్షన్‌లో ఉన్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. వీటిలో హౌరా-చెన్నై ప్రధాన రైల్వే లైన్‌ను నాలుగు ట్రాక్‌లుగా మార్చడం, కటక్-పారాదీప్ మార్గంలో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయి.

హౌరా-చెన్నై మార్గానికి మరింత ప్రాధాన్యం

హౌరా-చెన్నై రైల్వే మార్గం దేశంలోని అత్యంత కీలకమైన రైల్వే కారిడార్లలో ఒకటని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ మార్గం పూర్తిస్థాయిలో నాలుగు లైన్ల కారిడార్‌గా మారితే మరిన్ని రైళ్లను నడిపేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అదే సమయంలో సరుకు రవాణా సామర్థ్యం పెరగడంతో పాటు రైల్వే ట్రాక్‌ల నిర్వహణ కూడా సులభతరం అవుతుందని వివరించారు. దేశంలోని ఏడు కీలక రైల్వే మార్గాల్లో హౌరా-చెన్నై కారిడార్ కూడా ఒకటని పేర్కొన్నారు.

బీహార్‌లో రూ.3,591 కోట్ల హైవే

ఇక బీహార్‌లోని ముజఫర్‌పూర్-సీతామర్హి-సోన్‌బర్సా సెక్షన్‌ను నాలుగు లేన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 82.578 కిలోమీటర్ల పొడవైన NH-22 మార్గాన్ని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.3,590.73 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) విధానంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ రహదారి బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ను సీతామర్హి మీదుగా నేపాల్ సరిహద్దుకు సమీపంలోని సోన్‌బర్సాతో అనుసంధానించనుంది. ఇది కేబినెట్ ఆమోదించిన ఐదో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టు అని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

మొత్తం రూ.13,041 కోట్ల ప్రాజెక్టులు

నాలుగు రైల్వే ప్రాజెక్టులు, బీహార్ హైవే ప్రాజెక్టు కలిపి మొత్తం రూ.13,041 కోట్ల విలువైన పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘‘దేశ ప్రాథమిక మౌలిక వసతుల అవసరాలకు అత్యంత కీలకమైన ఐదు ప్రధాన నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇందులో మొదటి నాలుగు నిర్ణయాలు రైల్వేలకు సంబంధించినవి కాగా.. ఐదో నిర్ణయం హైవే రంగానికి సంబంధించినది’’ అని కేంద్రమంత్రి తెలిపారు. మోడీ నాయకత్వంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ఏపీకి చెందిన కీలక నిర్ణయాలు ఇవే

గుమ్మడిపుండి – గూడూరు మధ్య మూడవ నాలుగవ రైల్వే లైన్ నిర్మాణానికి రూ.2,229 కోట్లు. ఖరగ్పూర్ భద్రక్ మధ్య నాలుగోవ రైల్వే లైన్ నిర్మాణానికి రూ. 3,352 కోట్లు, భద్రక్ హరిదాస్పూర్ మధ్య నాలుగవ రైల్వే లైన్ కోసం రూ.1,583 కోట్లు, కటక్ పారాదీప్ మధ్య మూడవ నాలుగవ రైల్వే లైన్ ఏర్పాటుకు రూ. 2,286 కోట్లు, ముజఫర్పూర్-సీతా మరి- సొన్ బర్సా మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి రూ.3,591 కోట్లు కేటాయించారు.

Cabinet