Reading Time: < 1 minute
Telangana: ఉదయానే పొలానికి వెళ్లిన రైతు.. గట్లపై భారీ ఆకారంతో కనిపించిన వింత గుర్తులు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల, సిర్పూర్, చింతలమానేపల్లి మండలాల పరిధిలో పెద్దపులి స్థానిక ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలియడంతో రైతులు, స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఉదయం పొలాలకు వెళ్లిన స్థానిక రైతులకు ఆడేపల్లి, శీర్ష గ్రామాల సమీపంలోని వ్యవసాయ చేనుల్లో పెద్దపులి పాదముద్రలు కనిపించాయి. దీంతో భయపడిపోయిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పులి సంచారం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాలలో రైతులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

కౌటాల మండలం కనికి, కన్నెపల్లి, బోదంపల్లి, చింతలమానేపల్లి మండలం డబ్బా, ఆడేపల్లి, బారెగుడ గ్రామాల శివార్లలో పులి సంచారం నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ కుమార్ సూచించారు. వ్యవసాయ పనుల కోసం చేన్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, అటవీ ప్రాంతం వైపు ఒంటరిగా వెళ్లవద్దని డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

వివిధ గ్రామాల్లో డప్పు చాటింపులు, మైక్ లతో హెచ్చరికలు జారీ చేస్తూ అవగాహన కల్పిస్తూ ప్రజలను రైతులను అప్రమత్తం చేస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. పంట పొలాల్లో ఎక్కడైనా పులి పాదముద్రలు కనిపించినా, లేదా ఏఐనా ఆనవాళ్లు కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.