Reading Time: < 1 minute

ఫొటోలకు ఫోజులు ఇచ్చుడు తప్ప.. యువతకు 10 ఉద్యోగాలైనా ఇప్పించినవా: కేటీఆర్‎పై MP వంశీ ఫైర్

Caption of Image.

మంచిర్యాల: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‎పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఫైర్ అయ్యారు. బుధవారం (ఆగస్ట్ 19) మందమర్రిలో పర్యటించిన ఎంపీ వంశీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాల సెంటిమెంట్, యువత ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యువతకు ఆకాంక్షలు నేరవేరలేదని.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 25 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తే కేటీఆర్ ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ విదేశాలకు పోయి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్పితే.. 10 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడా అని ప్రశ్నించారు. కేటీఆర్ ఇకనైనా ప్రభుత్వం చేపట్టి ప్రతి పనిని అడ్డుకోవడం, విమర్శడం మానేయాలని హితవు పలికారు. 

కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో సింగరేణికి నష్టం: మంత్రి వివేక్

10 ఏండ్ల బీఆర్ఎస్ హయాంలో సింగరేణిలో లక్ష ఉద్యోగాలు ఉండే.. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో  38 వేల ఉద్యోగులే మిగిలారని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాకా వెంకటస్వామి, గడ్డం వినోద్ హయాంలో జైపూర్‎లో 850 మెగా వాట్ల పవర్ ప్లాంట్‎ను ప్రారంభించి 5 వేల ఉద్యోగాలు కల్పించారని గుర్తు చేశారు. 

ఆర్కే ఓపెన్ కాస్ట్ ఫారెస్ట్ అనుమతి కోసం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర యాదవ్‎ను ఇటీవల ఢిల్లీలో కలిశామని తెలిపారు. ఉద్యోగాలు ఎక్కడ ఉంటే యువత అక్కడే ఉద్యోగాలు చేయాలని సూచించారు. టామ్ కాం ద్వారా యువతకు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు చేపడితే బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALSO READ : టికెట్ రేట్లు పెంచుకుంటే 20% వాటా ఇవ్వాల్సిందే.

యువతకు జర్మనీ లాంగ్వేజ్ నేర్పిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు వేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. కేసులైతేనే గొప్ప నాయకులు అవుతారని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ సూచించడం సిగ్గుచేటని విమర్శించారు. 10 ఏండ్లు చెన్నూరు నియోజక వర్గ అభివృద్ధిని గత బీఆర్ఎస్ నాయకులు పట్టించుకోలేదన్నారు. 

©️ VIL Media Pvt Ltd.