
భారత్, శ్రీలంక మధ్య గాలెలో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా స్టార్ పేసర్, డీఎస్పీ మహ్మద్ సిరాజ్ అంపైర్ను భయపెట్టాడు. సిరాజ్ విసిరిన బుల్లెట్ త్రోకు అంపైర్ అహ్సాన్ రజా వణికిపోయాడు. బౌండరీ సమీపంలో సిరాజ్ బంతిని అందుకుని బలంగా విసరగా.. అది లెగ్ అంపైర్ రజాకు అత్యంత సమీపంగా దూసుకెళ్లింది. పరిస్థితిని గమనించిన అంపైర్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది.
ఈ ఘటనను మైదానంలో ఉన్న రవీంద్ర జడేజా గమనించాడు. అంపైర్ వెంటనే పక్కకు జరగడంతో.. జడేజా నవ్వులు పూయించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహ్మద్ సిరాజ్ త్రో వేగం, అంపైర్ వెంటనే తప్పుకున్న తీరు, జడేజా రియాక్షన్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గాలెలో రాడ్ టక్కర్ స్థానంలో అహ్సాన్ రజా అంపైర్గా వ్యవహరించారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో రోజు భారత బౌలర్లు శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశారు. మానవ్ సుతార్, రవీంద్ర జడేజా కలిసి ఏడు వికెట్లు పడగొట్టడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 284 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. తొలి టెస్టు ఆడుతున్న మానవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి బంతికే వికెట్ తీసిన అతడు.. మొత్తంగా 4/76 గణాంకాలతో సత్తా చాటాడు. పిచ్పై లభించిన టర్న్, బౌన్స్ను సద్వినియోగం చేసుకున్న సుతార్.. శ్రీలంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మరోవైపు సీనియర్ రవీంద్ర జడేజా 3/57తో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో జడేజా టెస్టు క్రికెట్లో 350 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు.
భారత బౌలింగ్ దళంలో కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ తీశారు. ఒక దశలో శ్రీలంక 90 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోవడంతో భారత్ ఫాలోఆన్ విధించే అవకాశం కనిపించింది. అయితే సోనాల్ దినూష, నిరోషన్ డిక్వెల్లా అద్భుతంగా పోరాడారు. ఇద్దరూ కలిసి ఆరో వికెట్కు ఏకంగా 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి శ్రీలంకను ఆడుకున్నారు. సోనాల్ దినూష 168 బంతుల్లో తన తొలి టెస్టు శతకాన్ని నమోదు చేశాడు. మరోవైపు డిక్వెల్లా 115 బంతుల్లో 80 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బంతితో డిక్వెల్లాను ఔట్ చేయడంతో శ్రీలంక వికెట్ల పతనం ఆగలేదు.