Reading Time: < 1 minute

NEET పేపర్ లీక్ నిరసనలు: విద్యార్థులపై పోలీసుల అత్యుత్సాహంపై సుప్రీంకోర్టు హై-పవర్డ్ కమిటీ

Caption of Image.

నీట్ పేపర్ లీక్ నిరసనల సమయంలో విద్యార్థులపై జరిగిన పోలీసుల బలప్రయోగం, లాఠీచార్జీలు, చెలరేగిన హింసపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఒక హై-పవర్డ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలపై సమగ్ర విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఈ కీలక నిర్ణయం వెలువడింది.

ఈ కమిటీలో ఒక మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తి, అలాగే ఒక రిటైర్డ్ డీజీపీ సభ్యులుగా ఉండనున్నారు. నిరసనల్లో పోలీసుల అత్యుత్సాహం, పెల్లెట్ గన్స్ వాడకం, లాఠీఛార్జ్, అలాగే నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి పరస్పర ఆరోపణలను ఈ కమిటీ పరిశీలించనుంది.

దర్యాప్తు పారదర్శకంగా జరిగేందుకు సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరా రికార్డింగ్‌లు, పీసీఆర్ కాల్ వివరాలను భద్రపరచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  నిరసనల్లో పాల్గొన్న విద్యార్థుల వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయరాదని, క్రిమినల్ రికార్డు లేని విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

ALSO READ : ఉరి శిక్ష ప్రత్యామ్నాయంపై సుప్రీం కోర్టులో ఆసక్తికర వాదనలు

శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనదే అయినప్పటికీ.. హింస చెలరేగినప్పుడు పోలీసులు పరిస్థితికి తగినట్లుగా వ్యవహరించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అరెస్టైన మైనర్లను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

ఢిల్లీ, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనలపై త్వరలోనే పూర్తి విధివిధానాలతో కూడిన అధికారిక ఉత్తర్వులను సుప్రీంకోర్టు జారీ చేయనుంది. ఈ కమిటీ అందించే రిపోర్ట్స్ ఆధారంగా ధర్మాసనం చర్యలు తీసుకోనుంది. 

©️ VIL Media Pvt Ltd.