
Son Skips Father’s Last Rites in Chittoor: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తిపాస్తులేవీ సంపాదించి పెట్టని తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టేందుకు కన్నా కొడుకు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొడుకు స్థానంలో తల కొరివి పెట్టే బాధ్యత కూతురు నెరవేర్చింది. తండ్రి అంత్యక్రియలను కుమార్తె స్వయంగా నిర్వహించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
చిత్తూరు జిల్లా కార్వేటినగరంకు చెందిన వెంకటేశ్వర్లు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన మృతి చెందారు. సుమారు 15 ఏళ్ల క్రితమే ఆయన భార్య శాంతమ్మ మృతి చెందడంతో.. అప్పటి నుంచి వెంకటేశ్వర్లు ఒంటరిగానే జీవిస్తున్నారు. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు మురళీకృష్ణ బతుకుదెరువు కోసం చెన్నైలో ఉంటున్నాడు. అయితే తండ్రి అనారోగ్యంతో ఉన్న సమయంలో పెద్ద కుమార్తె నాగరత్నం ఆయన ఆలనాపాలనా చూసుకుంది. నాగరత్నం భర్త కూడా ఇప్పటికే మృతి చెందడంతో.. తండ్రి బాధ్యతను ఆమె తీసుకున్నారు.
వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయాన్ని గ్రామస్తులు, బంధువులు చెన్నైలో ఉన్న కుమారుడు మురళీకృష్ణకు సమాచారం అందించారు. అయితే ఆయన గ్రామానికి రాకపోవడంతో.. తండ్రి అంత్యక్రియలకు కుమారుడు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో చివరకు పెద్ద కుమార్తె నాగరత్నమే తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. కొడుకు చేయాల్సిన తలకొరివి బాధ్యతను కూతురే చేపట్టి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తండ్రి చివరి ప్రయాణంలో కుమారుడి స్థానంలో కుమార్తె ముందుండి అంత్యక్రియలు చేయడం స్థానికులను కదిలించింది. కన్న కొడుకు చేయాల్సిన అంతిమ సంస్కారాలను కుమార్తె చేయాల్సి రావడం గ్రామంలో తీవ్ర చర్చకు దారితీసింది.