
సూపర్ స్టార్ రజినీకాంత్ , కమల్ హాసన్.. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ కలయికలో రాబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ‘ధర్మన్’. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్కు ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ముందు కె.ఎస్. రవికుమార్, సుందర్ సి, సిబి చక్రవర్తి.. ఇలా ఏకంగా ముగ్గురు దర్శకులు మారడం, ఆపై ఫైనల్గా అశ్వత్కు ఛాన్స్ దక్కడం విశేషం.
ఇటీవలే ఫస్ట్ లుక్ లో చేతిలో రక్తంతో ఉన్న సర్జికల్ బ్లేడ్ పట్టుకుని ‘ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ తో కనిపించిన తలైవా లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించనున్నారట..
లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఇందులో రజినీకాంత్కు అల్లుడిగా రామ్ కనిపించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. కేవలం అల్లుడిగానే కాకుండా, మామా-అల్లుళ్ల మధ్య జరిగే భారీ ఫేస్-ఆఫ్ సన్నివేశాలు, రజినీ పాత్రతో ఢీకొట్టే విధంగా ఉండే రామ్ ప్రతినాయక (విలనిజం) ఛాయలు సినిమాకే బిగ్గెస్ట్ హైలైట్గా నిలుస్తాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రామ్ పాత్రపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ఈ చిత్రంలో రజినీకాంత్ భార్యగా సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుండగా, రాశీ ఖన్నా వాళ్ల కూతురిగా (రామ్కు జోడీగా) కనిపించనున్నారు. యోగిబాబు, రుక్మిణి వసంత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలే రెండో షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ స్టార్డమ్కు అశ్వత్ మారిముత్తు తన యూత్ఫుల్ టేకింగ్ను జోడిస్తే ‘ధర్మన్’ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి రజినీకి అల్లుడిగా రామ్ పోతినేని నిజంగానే కనిపించనున్నాడా? దీనిపై అధికారిక క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..