
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్లో చైనా 60 కిలోమీటర్ల మేర చొచ్చుకువచ్చిందన్న వాదనల్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. ఈ ప్రచారం తప్పని, భారత్-చైనాల మధ్య అరుణాచల్లో సరిహద్దు చాలా పొడవుగా ఉందని, భూభాగంపై సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా గుర్తించబడలేదని ఆయన పేర్కొన్నారు. అరుణాచల్లోని అప్పర్ సుబాన్సిరి జిల్లాలో చైనా చొరబాటుకు పాల్పడిందనే వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. తక్సింగ్ ప్రాంతంలో చైనా సైనికులు వాస్తవ నియంత్రణ రేఖ (LAC) దాటి భారత భూభాగంలోకి వచ్చారని స్థానికులు ఆరోపించారు.
అరుణాచల్తో సరిహద్దు పూర్తిగా, స్పష్టంగా డీమార్క్ కాలేదని రిజిజు చెప్పారు. భారత్-టిబెట్ మధ్య సరిహద్దు గతంలో పూర్తిగా గుర్తించలేదని ఆయన అన్నారు. కొన్ని ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయని, స్థానిక గ్రామస్తులు వ్యక్తం చేస్తున్న ఆందోళనల్ని మాత్రం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే సమయంలో తప్పుడు వీడియోలు, నిర్ధారణ లేని ఆరోపణల్ని ప్రచారం చేయడం సరికాదని అన్నారు. ఇలాంటి ప్రచారం మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు దేశాన్ని గందరగోళానికి గురిచేస్తాయని అన్నారు. అయితే స్థానికుల ఆందోళనలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని చెప్పారు. ఆ ప్రాంతంలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) గస్తీని కూడా పెంచినట్లు వెల్లడించారు.
భారత సరిహద్దుల్లో చైనా రహదారుల నిర్మాణాలు చాలా కాలం క్రితమే ప్రారంభమైందని రిజిజు తెలిపారు. ఆ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సరిహద్దు వద్ద భారత మౌలిక సదుపాయాలను నిర్మించకూడదన్న విధానాన్ని పార్లమెంట్లో వెల్లడించారని రిజిజు పేర్కొన్నారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసినట్లు వెల్లడించారు.