Reading Time: 2 minutes
E10 Petrol Price E20 Blending Cea Proposal India

ఢిల్లీలో E10 పెట్రోల్ లీటరు ధర రూ. 167.35 కాగా, E5 ధర రూ. 109.24, ప్రస్తుతం అందుబాటులో ఉన్న E20 పెట్రోల్ ధర రూ. 102.12గా ఉంది. అయితే దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్‌ను తప్పనిసరి చేసినప్పటి నుంచి, వాహనాల మైలేజ్, ఇంజిన్ లైఫ్ పై వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ఒక కీలక సూచన చేశారు. పాత వాహనాల కోసం పెట్రోల్ బంకుల్లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కలిగిన E10 పెట్రోల్ రకాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకురావాలని, కొత్త వాహనాలకు E20ని కొనసాగించాలని ఆయన ప్రతిపాదించారు.

ఈ నేపథ్యంలో ఒకవేళ E10 పెట్రోల్ తిరిగి అందుబాటులోకి వస్తే దాని ధర ఎంత ఉండవచ్చనే చర్చ మొదలైంది. E10 ఇంధనంలో 90 శాతం పెట్రోల్, 10 శాతం ఇథనాల్ ఉంటాయి. ప్రస్తుతం వాడుతున్న E20లో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంది. ఢిల్లీలో పెట్రోల్ బేస్ ప్రైస్ లీటరుకు రూ. 81.12 కాగా, ఇథనాల్ సగటు కొనుగోలు వ్యయం రూ. 58 నుంచి రూ. 71.86 వరకు ఉంటుంది. పన్నులు, డీలర్ కమిషన్, వ్యాట్ అన్నీ కలిపితే E20 ధర రూ. 102.12గా ఉంది. E20తో పోలిస్తే E10లో ఇథనాల్ మోతాదు తగ్గి, పెట్రోల్ 10 శాతం పెరుగుతుంది కాబట్టి దాని తయారీ వ్యయం కాస్త పెరుగుతుంది. లెక్కల ప్రకారం E10 పెట్రోల్ లీటరు ధర మార్కెట్లోకి వస్తే రూ. 103 నుండి రూ. 105 మధ్యలో ఉండే అవకాశం ఉంది. నగరాలను బట్టి ఈ ధరల్లో మార్పులు ఉంటాయి.

మరోవైపు ఇథనాల్ అస్సలు కలపని ప్రీమియం గ్రేడ్ పెట్రోల్ కూడా ప్రస్తుతం ఎంపిక చేసిన నగరాల్లో లభిస్తోంది. ఇండియన్ ఆయిల్ (XP100), భారత్ పెట్రోలియం (Speed100), హిందూస్థాన్ పెట్రోలియం (Power100) కంపెనీలు విక్రయించే 100 ఆక్టేన్ ప్రీమియం పెట్రోల్‌ను ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ నిబంధనల నుంచి మినహాయించింది. ఈ E0 పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, జైపూర్, ముంబై, పుణే, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్ వంటి ప్రధాన నగరాల్లోని కొన్ని ఎంపిక చేసిన బంకుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. పాత వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు E10ని మళ్లీ తీసుకురావాలనే ప్రపోజల్‌పై ప్రభుత్వం త్వరలోనే సరైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.