
ఒంట్లో వేడిని తగ్గించేందుకు, శరీర ఆరోగ్యాన్ని కాపాడేందుకు రాగులు అద్భుతమైన ఆహారం.. రాగులలో (Finger Millet) కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల రాగులలో సుమారు 336 నుండి 350 కేలరీలు, 344 మి.గ్రా కాల్షియం, 7 గ్రాముల ప్రొటీన్, 11 గ్రాముల పీచు పదార్థం (ఫైబర్) ఉంటాయని.. అందరికీ.. ఇది సూపర్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి, శరీరంలో వేడిని తగ్గించి ఒంటిని చల్లబరచడానికి రాగి జావ (Ragi Java) అద్భుతంగా తోడ్పడుతుంది. అంతేకాకుండా పలు సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే.. చాలా మంది రాగి జావను ఉదయాన్నే తాగుతారు. అయితే, సాధారణంగా రాగి జావ తాగడానికి ఇష్టపడని వారు కూడా ఈ ప్రత్యేకమైన పద్ధతిలో (మసాలా / తాలింపు వర్షన్) చేస్తే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు.
రుచికరమైన, ఆరోగ్యకరమైన స్పైస్డ్ రాగి జావను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోండి..
కావలసిన పదార్థాలు:
- రాగి పిండి: పావు కప్పు
- నీరు: రాగి పిండి కలపడానికి (అర కప్పు) + ఉడికించడానికి (ఒక కప్పు) + మజ్జిగ కోసం (ఒక కప్పు)
- పెరుగు: అర కప్పు
- నూనె: 1 టీస్పూన్
- ఆవాలు: కొద్దిగా
- పచ్చిమిర్చి: 1 (సన్నగా తరిగినది)
- అల్లం తరుగు: 2 ఇంచుల ముక్క (తురిమినది)
- కరివేపాకు: సన్నగా తరిగినది
- ఉల్లిపాయ తరుగు: తగినంత (సన్నగా తరిగినది)
- నిమ్మరసం: 1 చిన్న నిమ్మకాయ రసం
- కొత్తిమీర: కొద్దిగా
- ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం:
రాగి మిశ్రమం తయారీ: ఒక గిన్నెలో పావు కప్పు రాగి పిండి వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి.
మరొక గిన్నెలో ఒక కప్పు నీటిని బాగా మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోసి, స్టవ్ సిమ్లో పెట్టి 2 నిమిషాల పాటు చిక్కబడే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
మజ్జిగ తయారీ:
వేరొక గిన్నెలో అర కప్పు పెరుగు వేసి ఉండలు లేకుండా సాఫ్ట్గా విస్క్ (కలపడం) చేసుకోవాలి.
అందులో ఒక కప్పు నీరు పోసి మజ్జిగలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఫ్లేవర్ఫుల్ తాలింపు:
తాలింపు గిన్నెలో ఒక స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
అందులో ఆవాలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తురిమిన అల్లం, తరిగిన కరివేపాకు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి దించుకోవాలి.
కలిపే విధానం:
ఒక పెద్ద గిన్నెలో సిద్ధం చేసుకున్న మజ్జిగ, పూర్తిగా చల్లారిన రాగి పిండి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. (అవసరాన్ని బట్టి నీటి చిక్కదనాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు).
ఇందులో వేయించి పెట్టుకున్న తాలింపు, సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మరసం, కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఆరోగ్య ప్రయోజనాలు:
శరీరంలో వేడిని తగ్గిస్తుంది.
అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మరసం కలపడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది.
రోజూ ఒక గ్లాసు ఈ విధంగా తయారు చేసుకున్న రాగి జావ తాగితే రోజంతా ఉత్సాహంగా, చల్లగా ఉంటారు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..