Reading Time: 2 minutes
Hyderabad Prostitution Gang Pocso Court Verdict 33 Convicted

POCSO Court : హైదరాబాద్‌లోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు వ్యభిచార ముఠా నిర్వహణ, మైనర్ బాలికలపై లైంగిక దాడులు , అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో మొత్తం 33 మంది నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ హాకా భవనంలోని ప్రత్యేక సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఉదయ్ భాస్కర్ రావు శిక్షలు ఖరారు చేశారు. సీఐడీ హైదరాబాద్ పరిధిలోని 2015 నాటి కేసులో పూర్తిస్థాయి విచారణ అనంతరం ఈ చారిత్రాత్మక తీర్పు వెలువడింది.

శిక్షల వివరాలు , బాధితులకు పరిహారం

కేసులో మొత్తం 45 మంది నిందితులు ఉండగా, వారిలో 33 మందికి న్యాయస్థానం వివిధ రకాల శిక్షలను ఖరారు చేసింది. ఐదుగురు ప్రధాన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ముగ్గురు నిందితులకు 14 ఏళ్లు, 14 మంది నిందితులకు 10 ఏళ్లు, , మరో 11 మంది నిందితులకు మూడేళ్ల చొప్పున కఠిన కారాగార శిక్ష పడింది. పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా మొత్తం 38 మంది బాధితులను రక్షించగా, అందులో తొమ్మిది మంది మైనర్ బాలికలు ఉన్నారు. ఈ తొమ్మిది మంది బాధిత బాలికలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.45 లక్షల పరిహారాన్ని అందజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఉద్యోగం పేరుతో మోసం.. నరకం చూపించిన ముఠా

2015 జూలై 17న ఓ బాధితురాలు సీఐడీ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వ్యవసాయ పనులు చేసుకునే సదరు బాధితురాలికి గ్రామానికి చెందిన పరిచయస్తుడే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఖమ్మం, బల్లార్షా ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ నిందితులు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దించి, రోజుకు 10 నుంచి 15 మంది విటులతో లైంగిక సంబంధాలు పెట్టుకునేలా తీవ్రంగా వేధించారు. సుమారు నాలుగు నెలల పాటు వారి చెరలో నరకం అనుభవించిన బాధితురాలు, ఎట్టకేలకు వారి నుంచి తప్పించుకుని హైదరాబాద్ సీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేసింది.

సీఐడీ పకడ్బందీ దర్యాప్తు.. అధికారులకు ప్రశంసలు

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు ప్రత్యేక బృందాలతో వ్యభిచార కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో A1 నుంచి A45 వరకు ఉన్న 45 మంది నిందితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 38 మంది బాధితులను రక్షించారు. తిరుగులేని ఆధారాలతో సీఐడీ అధికారులు పకడ్బందీగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో దోషులకు కఠిన శిక్షలు ఖరారయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో డీఎస్పీలు సురేష్ బాబు, కె. శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు కె. బాలరాం రెడ్డి, ఎస్.ఏ.కె. జీలానీ కీలకంగా వ్యవహరించగా, కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మారెళ్ల రమాదేవి సమర్థవంతంగా వాదనలు వినిపించారు. బాధితులకు భరోసా లీగల్ కౌన్సిలర్ టి. కల్పన న్యాయ సహాయం అందించారు. చట్టపరమైన ఈ కఠిన చర్యల ద్వారా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేకూరిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.