July 6, 2026

భారత ఐక్యతకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ: ప్రధాని మోదీ

భారత ఐక్యతకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ: ప్రధాని మోదీ
Reading Time: 2 minutes
భారత ఐక్యతకు జీవితాన్ని అంకితం చేసిన మహానేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ: ప్రధాని మోదీ

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తన జీవితాన్ని భారతదేశ ఐక్యత, అభివృద్ధికి అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆయన 125వ జయంతి సందర్భంగా రాసిన బ్లాగ్‌లో ముఖర్జీ జీవితాన్ని స్మరించుకున్న ప్రధాని, ఆయనను ధైర్యానికి, దేశభక్తికి చిరస్థాయిగా నిలిచే ప్రతీకగా అభివర్ణించారు. “డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవితం ధైర్యానికి కాలాతీత ఉదాహరణ. మాతృభారతి పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం” అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, వ్యక్తిగత సౌకర్యాల కంటే దేశ సేవనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారని ఆయన అన్నారు.

విభజన సమయంలో పశ్చిమ బెంగాల్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండేలా చూసేందుకు ముఖర్జీ కీలక పాత్ర పోషించారని ప్రధాని గుర్తు చేశారు. అనంతరం జమ్మూకశ్మీర్‌ను భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలనే లక్ష్యంతో ఆయన పోరాడారని, జైలు జీవితం కూడా ఆయన సంకల్పాన్ని మార్చలేకపోయిందని చెప్పారు. నిర్బంధంలోనే ఆయన జీవితం ముగిసిన విషయాన్ని ప్రధాని ప్రస్తావిస్తూ, దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. 2019లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35(ఏ) నిబంధనలను రద్దు చేయడాన్ని డాక్టర్ ముఖర్జీ ఆశయాలకు తగిన నివాళిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఈ నిబంధనలను తొలగించడం ద్వారా దేశ సమైక్యత మరింత బలపడిందని ఆయన పేర్కొన్నారు.

డాక్టర్ ముఖర్జీ విద్యారంగానికి చేసిన సేవలను కూడా ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన, గ్రంథాలయాల అభివృద్ధి, పరిశోధనలకు ప్రోత్సాహం, పురావస్తు అధ్యయనాల విస్తరణ కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు కట్టుబడి ఉంటూనే దేశ అభివృద్ధికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమనే ఉద్దేశంతో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారని ప్రధాని చెప్పారు. స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి పరిశ్రమల మంత్రిగా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సింద్రీ ఎరువుల కర్మాగారం వంటి కీలక పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆయన విశేష కృషి చేశారని గుర్తుచేశారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, విద్యా అభివృద్ధి, జాతీయతకు ప్రతీకగా నిలిచారని ప్రధాని మోదీ కొనియాడుతూ, ఆయన ఆశయాలు నేటి భారత నిర్మాణానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి