Reading Time: < 1 minute
Pakistan Air Force Group Captain Asim Tariq Shot Dead Islamabad

Pakistan: పాకిస్తాన్‌లో ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్‌ను గుర్తుతెలియని దండగుడు కాల్చి చంపాడు. ఆదివారం ఇస్లామాబాద్‌లోని షాహీన్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఒక మహిళను గుర్తుతెలియని యువకుడు కారులో బలవంతంగా ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా, అటుగా వెళ్తున్న అసిమ్ తారిఖ్ కాపాడే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ యువకుడు అతడిని తుపాకీతో కాల్చి, అక్కడి నుంచి పరారయ్యాడు. బుల్లెట్ గాయంతో తారిఖ్ అక్కడిక్కడే మరణించాడు. అతడి మృతదేహాన్ని పాక్ వైమానిక దళ ఆస్పత్రికి తరలించారు.

నిమ్రాగా గుర్తించిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాక్ మీడియా చెబుతున్న వివరాల ప్రకారం, నిందితుడు మహిళకు తెలిసిన సహోద్యోగే అని, అతడి పేరు సాద్ అని గుర్తించారు. తనకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి, దారి మళ్లించి తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మహిళ ఆరోపించింది. ఫెడరల్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి, మృతుని కుటుంబానికి హృదయపూర్వక సంతాపం తెలిపారు. నిందితుడి కోసం ఇస్లామాబాద్ వ్యాప్తంగా గాలిస్తున్నారు.

ఈ ఘటనకు ముందు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లోని మొహమండ్ జిల్లాలో శుక్రవారం సాయుధ దుండగులు పోలీసు పెట్రోలింగ్‌పై దాడి చేయడంతో, ఒక అదనపు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో సహా ఇద్దరు పాకిస్తానీ పోలీసు సిబ్బంది మరణించారని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ దాడికి పాల్పడింది నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన ఉగ్రవాదులనే ఆరోపణలు ఉన్నాయి.