July 6, 2026

Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!

Celina Jaitly: పెళ్లి రోజు గిఫ్ట్ అంటూ విడాకుల నోటీసు.. స్టార్ హీరోయిన్ ఎమోషనల్!
Reading Time: 2 minutes
Celina Jaitly Reveals Painful Divorce Ordeal Says Anniversary Gift Turned Into Divorce Notice

Celina Jaitly: సినీ తారల జీవితాలు బయటకు కనిపించేంత అందంగా ఉంటాయని చాలామంది భావిస్తారు. ఖరీదైన ఇళ్లు, విలాసవంతమైన జీవితం, విదేశీ పర్యటనలు చూస్తే వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు ఉండవని అనిపిస్తుంది. కానీ కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఆ మెరుపుల వెనుక ఎంతటి విషాదం ఉందో తెలుస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ చెప్పిన జీవిత కథ కూడా అలాంటిదే. ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, వైవాహక జీవితంలో తాను అనుభవించిన మానసిక వేదనను తాజాగా బయటపెట్టారు. పెళ్లి రోజు కానుక అనుకున్న కవర్‌లో విడాకుల నోటీసు రావడం, ఆ నోటీసును తన చిన్న పిల్లల నోటే వినాల్సి రావడం, చివరకు ప్రాణం దక్కించుకోవాలనే ఆలోచనతో అర్ధరాత్రి స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఎదురవడం వంటి విషయాలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు మంచు విష్ణు హీరోగా వచ్చిన ‘సూర్యం’ సినిమా ద్వారా పరిచయమైన సెలీనా జైట్లీ, 2010లో ఆస్ట్రియన్ వ్యాపారవేత్త పీటర్ హాగ్‌ను వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు. వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని అందరూ భావించారు. అయితే దాదాపు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సమయంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు.

తన 15వ వివాహ వార్షికోత్సవానికి కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటూ సెలీనా ఎమోషన్ అయ్యారు. ఒకరోజు తన భర్త కారులో తీసుకెళ్లి కొండ కింద రోడ్డుపై దించేసి వెళ్లిపోయాడని తెలిపారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి చేరుకున్న ఆమెకు ఆస్ట్రియా నుంచి వచ్చిన లేఖ కనిపించిందని, భాష అర్థం కాకపోవడంతో తన పిల్లలకు చదవమని ఇచ్చానని చెప్పుకొచ్చారు. కానీ అది పెళ్లి రోజు కానుక పేరిట పంపించిన విడాకుల నోటీసు అని తెలిసిన క్షణం తన ప్రపంచమే కూలిపోయిందని, తన చిన్నారుల నోటే ఆ వార్త వినడం జీవితాంతం మర్చిపోలేని గాయంగా మిగిలిపోయిందని ఆమె కన్నీళ్ళు పెట్టుకన్నారు.

ఆ నోటీసులో తనపై అనేక ఆరోపణలు చేసినట్లు సెలీనా తెలిపారు. కోర్టు మొదటి విచారణలో ఇద్దరూ సామరస్యంగా విడిపోయే ప్రయత్నం చేయాలని సూచించినప్పటికీ, అప్పటికే తాను తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిడిలో ఉన్నానని చెప్పారు. తన బ్యాంకు ఖాతాలో కూడా ఏమాత్రం డబ్బులేదని, అయినప్పటికీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రశాంతంగా సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భర్త ఆస్తిలో తనకు ఎలాంటి వాటా అవసరం లేదని, తాను కష్టపడి సంపాదించిన సొంత ఆస్తులు మాత్రమే తిరిగి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే పిల్లల సంరక్షణ బాధ్యత కూడా కావాలని కోర్టును అభ్యర్థించినట్లు తెలిపారు.

అయితే ఆ తర్వాత పరిస్థితులు మరింత ఘోరంగా మారాయని సెలీనా వివరించారు. ఒకే ఇంట్లో భర్త పై అంతస్తులో ఉంటే, తాను పిల్లలతో మధ్య అంతస్తులో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఉద్యోగం చేయాలని ఒత్తిడి తెచ్చడమే కాకుండా, సూపర్ మార్కెట్‌లో క్లీనర్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ అవమానించారని వెల్లడించారు. ఇదే సమయంలో భారత్‌లో తాను కొనుగోలు చేసిన ఆస్తులను కూడా విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యానని చెప్పారు. చివరకు 2025 అక్టోబర్ 11న అర్ధరాత్రి ఒక గంట సమయంలో ఆస్ట్రియా నుంచి ఒంటరిగా భారత్‌కు రావాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. భారత్‌కు వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు సులభంగా మారలేదని సెలీనా తెలిపారు. ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకపోవడంతో దాదాపు పది రోజుల పాటు హోటల్‌లోనే గడపాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో పాటు కొందరు సన్నిహిత మిత్రులు అండగా నిలవడంతో మళ్లీ జీవితాన్ని ప్రారంభించే ధైర్యం వచ్చిందని చెప్పారు.

2012లో విన్‌స్టన్, విరాజ్ అనే కవలలకు జన్మనిచ్చిన ఆమె, 2017లో ఆర్థర్‌కు జన్మనిచ్చారు. అంతకుముందు షంషేర్ అనే మరో కుమారుడు గుండె సంబంధిత సమస్యతో మరణించడం కూడా తన జీవితంలో తీరని విషాదంగా మిగిలిందని వెల్లడించారు. ప్రస్తుతం సెలీనా జైట్లీ తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. 2025 నవంబర్‌లో ముంబై అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో గృహహింస, క్రూరత్వం ఆరోపణలతో కేసు నమోదు చేసిన ఆమె, ఆస్ట్రియా కోర్టు జాయింట్ కస్టడీ ఇచ్చినప్పటికీ పిల్లలకు తనతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు తెరపై చిరునవ్వులు పంచిన హీరోయిన్, నిజ జీవితంలో ఇంతటి మానసిక వేదనను అనుభవించాల్సి వచ్చిందన్న విషయం అభిమానులను కూడా కలచివేస్తోంది.