
గండిపేట, వెలుగు: సొంతింటి కలతో ప్రణీత్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వందలాది మంది మధ్యతరగతి కుటుంబాలు మోసపోయామని ఆరోపిస్తూ ఆదివారం మణికొండ, పుప్పాలగూడలో ఆందోళన చేపట్టాయి.
ఏడేళ్లు గడిచినా ఫ్లాట్లు అప్పగించకపోవడంతో పాటు ఒకే ఫ్లాట్ను ఇద్దరికి విక్రయించి మోసం చేశారని బాధితులు ఆరోపించారు. బాధితుల కథనం ప్రకారం.. ప్రణీత్ గ్రూప్ ఒక్కో ఫ్లాట్కు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసింది. అయితే ప్రాజెక్టులో ఉన్న 110 ఫ్లాట్లను ఏకంగా 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించిందని ఆరోపించారు.
ఈ మోసానికి పాల్పడిన ప్రణీత్ గ్రూప్ అధినేత సురేశ్, ఆయన కొడుకు ప్రణీత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పారు. అప్పులు చేసి, బంగారం, పొలాలు తాకట్టు పెట్టి ఫ్లాట్ల కోసం డబ్బులు చెల్లించామని, ఇప్పుడు అద్దె ఇళ్లు, బ్యాంకు రుణాలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని పలువురు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ మోసంపై గతంలోనే కొందరు బాధితులు నార్సింగి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేదని తెలిపారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని కోరారు.