Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య కేసులో షాకింగ్ విషయాలు.. దొంగిలించిన డబ్బుతో కార్లు, ఖరీదైన ఫోన్లు, గిఫ్ట్లు..!

Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిరానికి వచ్చిన కానుకల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లా పోలీసుల విచారణలో కీలక వివరాలను వెల్లడించినట్లు సమాచారం. దొంగిలించిన డబ్బులో పెద్ద మొత్తాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలినట్లు తెలుస్తోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, అవినాష్ శుక్లా తన కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం సుమారు రూ.19 లక్షలు ఖర్చు చేశాడు. తన సోదరుల్లో ఒకరి వివాహానికి దాదాపు రూ.6 లక్షలు ఇవ్వగా, మరో ఇద్దరు సోదరులకు చెరో రూ.5 లక్షలు అందజేసినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా సుమారు రూ.3.5 లక్షలతో ఒక కారును కొనుగోలు చేసినట్లు, మరో స్నేహితుడికి రూ.2.5 లక్షల నగదుతో పాటు ఖరీదైన మొబైల్ ఫోన్ను బహుమతిగా ఇచ్చినట్లు విచారణలో బయటపడింది. పలువురు ఇతరులకు కూడా చిన్న మొత్తాల్లో నగదు పంపిణీ చేసినట్లు అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో భాగంగా అవినాష్ శుక్లా ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రూ.20.39 లక్షల నగదు, 1,121 అమెరికన్ డాలర్లు, బంగారం, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులతో పాటు ఒక ఎస్యూవీని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులన్నింటి మూలాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ వివాదం నేపథ్యంలో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా జూన్ 26న తమ రాజీనామాలు సమర్పించారు. ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి వాటిని ధృవీకరించారు. సోమవారం జరిగే ట్రస్ట్ సమావేశంలో ఈ రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలయ నిర్వహణ, కానుకల లెక్కింపు వంటి కీలక బాధ్యతలు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల పర్యవేక్షణలోనే ఉండటంతో ఈ వివాదం ట్రస్ట్ ప్రతిష్టపై ప్రభావం చూపింది. ట్రస్ట్ విశ్వసనీయతను కాపాడేందుకు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని వర్గాలు పేర్కొంటున్నాయి.