Reading Time: 2 minutes
Sophie Ecclestones Comical Fielding Blunder Goes Viral During India Vs England Womens T20i

భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ చేసిన ఫీల్డింగ్ తప్పిదం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ‘ఇది నిజంగా అంతర్జాతీయ మ్యాచ్‌లో జరిగిందా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత్ ఇన్నింగ్స్ చివరి బంతికి ఈ సంఘటన జరిగింది.

ఇంగ్లండ్ తరఫున బౌలింగ్ చేసిన సోఫీ ఎక్లెస్టోన్.. భారత బ్యాటర్ రిచా ఘోష్‌కు యార్కర్ బంతిని వేసింది. బంతిని ఆడిన రిచా ఒక పరుగు కోసం ప్రయత్నించగా.. సులభంగా రన్‌ఔట్ చేసే అవకాశం ఎక్లెస్టోన్‌కు లభించింది. అయితే వికెట్లకు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉన్నప్పటికీ.. ఆమె వేసిన త్రో స్టంప్స్‌ను తాకకుండా పక్కకు వెళ్లిపోయింది. దీంతో అప్పటికే రన్‌ఔట్ అయ్యానని భావించి నెమ్మదించిన రిచా.. మళ్లీ పరుగెత్తి ఓవర్‌త్రో రూపంలో మరో పరుగు కూడా సాధించింది. ఈ ఘటన తర్వాత సోఫీ ఎక్లెస్టోన్ కూడా నవ్వును ఆపుకోలేకపోయింది.

సోఫీ ఎక్లెస్టోన్ త్రో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఇది గల్లీ క్రికెట్‌ను గుర్తు చేసింది’ అంటూ పలువురు అభిమానులు సరదాగా కామెంట్స్ చేశారు. మరికొందరు ‘ఇలాంటి ఘటనను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు ఆ జోరును కొనసాగించలేకపోయింది. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయింది.