Reading Time: 2 minutes
Ktr Challenges Congress Says He Will Quit Politics If Indiramma Houses Are Shown In Hyderabad

KTR: కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే వివేక్ గౌడ్, నవీన్ రావు, శంభీపూర్ రాజు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై విస్తృత చర్చ జరిగింది.

సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత హైదరాబాద్ భవిష్యత్‌పై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. అయితే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని.. పేద ప్రజలు సురక్షితంగా, సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా పాలన కొనసాగించామని ఆయన అన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న పేదలకు న్యాయం చేయడానికి జీఓ 58, 59 ద్వారా పట్టాలు జారీ చేసిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం “ఇందిరమ్మ రాజ్యం”, “ప్రజా పాలన” పేరుతో హైడ్రా ద్వారా ఇళ్లను కూలగొడుతోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఇళ్లులు కట్టకపోగా, వేల సంఖ్యలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆయన ఆరోపించారు. పెన్షన్ల విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం రూ.200 నుంచి రూ. 2000కు పెంచిందని, కానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, అలవికాని హామీలు ఇచ్చి ఓట్లు దక్కించుకుందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికల్లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి జేబులో “కత్తెర పెట్టుకుని తిరుగుతుంటే.. దాన్ని జేబు దొంగ అనుకోవద్దు, ఆయన గజదొంగ” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరోవైపు హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు. నగరంలో నాలుగు 1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని, హైదరాబాద్‌లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

గత రెండున్నరేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని ఆయన ఆరోపించారు. గృహ నిర్మాణ రంగ కార్మికులకు అండగా నిలిచేది బీఆర్‌ఎస్ పార్టీయేనని, జూన్ నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.