Reading Time: 2 minutes
Rcb Secures Top Spot Despite Loss To Srh Ipl Playoff Race

RCB vs SRH: ఐపీఎల్ టోర్నీలో ఒక విచిత్రమైన, వ్యూహాత్మకమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. మ్యాచ్‌లో ఓడిపోయినా.. తాము అనుకున్న అసలైన లక్ష్యాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగళూరు 55 పరుగుల తేడాతో ఓటమి పాలైనప్పటికీ, మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి టేబుల్ టాపర్‌గా నిలిచింది. దీంతో వచ్చే మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మొదటి క్వాలిఫైయర్ (ప్లేఆఫ్) మ్యాచ్‌కు బెంగళూరు వేదిక కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా మే 31న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌కు చేరుకుంటుంది.

మరోవైపు బెంగళూరు, గుజరాత్ జట్లతో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ.. నెట్ రన్ రేట్ పరంగా మూడో స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇక వచ్చే బుధవారం జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఇందులో హైదరాబాద్ ఎవరితో తలపడాలనేది ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అంతేకాదు.. ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లలోనే 9వ సారి 200 ప్లస్ స్కోరును నమోదు చేస్తూ హైదరాబాద్ మరోసారి అదరగొట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్ (51) అర్ధసెంచరీలతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సీనియర్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లను హైదరాబాద్ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ కలిసి 8 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 106 పరుగులు సమర్పించుకున్నారు. మూడుసార్లు క్యాచ్ డ్రాప్ కావడం వల్ల లైఫ్ లభించిన అభిషేక్ శర్మ కేవలం 21 బంతుల్లోనే 5 సిక్సర్లు, 4 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్పిన్నర్ కృనాల్ పాండ్యా వేసిన రెండు ఓవర్లలోనే 24 పరుగులు పిండుకున్న క్లాసెన్‌ను.. ఆ తర్వాత 17వ ఓవర్లో అతడే అవుట్ చేశాడు. ఈ విధంగా హైదరాబాద్ ఈ సీజన్‌లోనే తమ అత్యుత్తమ స్కోరును సాధించింది.

హైదరాబాద్ నిర్దేశించిన 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని భావించిన బెంగళూరు, పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలవడానికి అవసరమైన 166 పరుగుల మార్క్‌ను దాటడమే ప్రాధాన్యతగా పెట్టుకుంది. ఈ సీజన్‌లో మొదటిసారి ఓపెనర్‌గా వచ్చిన వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లోనే 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 44 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే పవర్‌ప్లేలోనే విరాట్ కోహ్లీ (15), దేవదత్ పడిక్కల్ తక్కువ పరుగులకే అవుట్ కావడంతో బెంగళూరు తమ వ్యూహాన్ని మార్చుకుంది. మ్యాచ్ గెలవడం కంటే టాప్-2 లో నిలవడమే లక్ష్యంగా కెప్టెన్ రజత్ పాటిదార్, కృనాల్ పాండ్యా క్రీజులో పాతుకుపోయారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ 17వ ఓవర్లోనే జట్టు స్కోరును 166 పరుగులకు చేర్చారు. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో నంబర్ వన్ స్థానాన్ని ఖాయం చేసుకోవడానికి అవసరమైన 178 పరుగుల మార్క్‌ను సైతం దాటేశారు. చివరకు రజత్ పాటిదార్ 56 పరుగులు చేసి అవుట్ కాగా, కృనాల్ పాండ్యా 41 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 200 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించింది.