
హర్యానవీ మ్యూజిక్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటి, సోషల్ మీడియా స్టార్ దివ్యాంక సిరోహి (29) కన్నుమూశారు. మంగళవారం రాత్రి ఘజియాబాద్లోని తన నివాసంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె కుప్పకూలిపోయారు. ఆ సమయంలో తలకు తీవ్రమైన గాయం కావడంతో రక్తస్రావం జరిగి, ఆసుపత్రికి తరలించే లోపే ఆమె ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. సాధారణ ఉద్యోగాన్ని వదిలి, నటనపై మక్కువతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్యాంక ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
‘మేరీ మమ్మీ ను పసంద్ నీ తూ’ అనే పాటకు ఆమె చేసిన డ్యాన్స్ వీడియో రాత్రికి రాత్రే ఆమెను స్టార్ను చేసింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోని దివ్యాంక, సుమారు 50కి పైగా హిట్ మ్యూజిక్ వీడియోల్లో కథానాయికగా నటించి మెప్పించారు. మాసూమ్ శర్మ, అమిత్ సైనీ వంటి టాప్ సింగర్ల సరసన ఆమె చేసిన వీడియోలు యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే దివ్యాంకకు ఇన్స్టాగ్రామ్లో 13 లక్షల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. బుధవారం ఉదయం ఘజియాబాద్లో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కేవలం 29 ఏళ్ల వయసులోనే ఒక ప్రతిభావంతురాలైన నటి మనల్ని విడిచి వెళ్లడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. దివ్యాంక మృతి పట్ల హర్యానవీ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, తన స్వయంకృషితో ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న దివ్యాంక ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం అభిమానులను కలిచివేస్తోంది.