
Venugopal Rao: నిన్న ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీని ముప్పు తిప్పలు పెట్టింది. ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) నిర్దేశించిన 243 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చతికిలపడింది. ఇక మ్యాచ్ అనంతరం ఢిల్లీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్లో ఢిల్లీ ఓటమికి టాప్ ఆర్డర్ వైఫల్యమే ప్రధాన కారణమని ఆ జట్టు క్రికెట్ డైరెక్టర్ వై.వేణుగోపాల్ రావు (Yalaka Venugopal Rao) కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా పవర్ప్లేలో ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోవడం జట్టును దెబ్బతీసిందని విశ్లేషించారు. 240కి పైగా పరుగులను ఛేదించేటప్పుడు తొలి ఆరు ఓవర్లలో కనీసం 80 నుంచి 90 పరుగులు చేయాలని, కానీ తమ జట్టు కేవలం 59 పరుగులు మాత్రమే చేసిందని వేణుగోపాల్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. “మేము పవర్ప్లేలో 15 నుంచి 20 పరుగులు తక్కువగా చేశాం. ఇంత భారీ లక్ష్యం ముందున్నప్పుడు ఆరంభం మెరుపు వేగంతో ఉండాలి. మా వద్ద ఉన్న బ్యాటింగ్ డెప్త్కు ఆ స్కోరు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది” అని పేర్కొన్నారు.
READ MORE: Dhurandhar: హిస్టరీలో ఫస్ట్ టైమ్.. థియేటర్లలో ‘ధురంధర్’ మేకింగ్?
ఓపెనర్ పాతుమ్ నిస్సంక (8) త్వరగా అవుటైన తర్వాత, కెప్టెన్ కేఎల్ రాహుల్కు తగినంత స్ట్రైక్ దొరకలేదని వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. పవర్ప్లేలో రాహుల్ కేవలం 6 బంతులు మాత్రమే ఎదుర్కోగా, వన్ డౌన్లో వచ్చిన నితీష్ రాణా 17 బంతులు ఆడాడు. రాణా టైమింగ్ దొరకక ఇబ్బంది పడటం వల్ల రాహుల్ తన రిథమ్ను కోల్పోయాడని, ఇదే మ్యాచ్ మొమెంటమ్ను ఎస్ఆర్హెచ్ వైపు తిప్పిందని వివరించారు. రాహుల్ 23 బంతుల్లో 37 పరుగులు చేయగా, రాణా 30 బంతుల్లో 57 పరుగులు చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్తో కేవలం రెండు ఓవర్లే వేయించి, పార్ట్ టైమ్ స్పిన్నర్ నితీష్ రాణాతో నాలుగు ఓవర్లు వేయించడంపై వచ్చిన ప్రశ్నలకు వేణుగోపాల్ రావు స్పందిస్తూ.. “ఫీల్డ్ లో కెప్టెన్ తీసుకునే తక్షణ నిర్ణయాలు అవి. టి20ల్లో ఇలాంటి జూదాలు (Gambles) పారితే గొప్ప నిర్ణయాలంటారు, లేదంటే విమర్శలు వస్తాయి” అని వెనకేసుకొచ్చారు.