
ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి అత్యంత వేడుకైన ‘చందనోత్సవం’ కోసం క్షేత్రం సర్వం సిద్ధమైంది. ఏటా వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) పర్వదినాన మాత్రమే స్వామి వారు చందన పూత లేకుండా తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు రెండు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు, అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా తొలుత ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిత పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం, రేపు తెల్లవారుజామున 3:30 గంటల నుండి సామాన్య భక్తులకు నిజరూప దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ దర్శన భాగ్యం కలుగుతుందని, ఆ తర్వాత తిరిగి స్వామి వారికి 125 కిలోల కొత్త చందనంతో పూత వేస్తామని ఆలయ కమిటీ తెలిపింది.
ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) , దేవస్థానం అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. సుమారు 200 పాయింట్లలో 20 లక్షల వాటర్ బాటిళ్లను అందుబాటులో ఉంచడంతో పాటు, మజ్జిగ, బిస్కెట్లు , చిన్న పిల్లలకు పాలు పంపిణీ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భద్రతా పరంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 2,800 మంది పోలీసులతో పహారా ఏర్పాటు చేయడమే కాకుండా, ఈసారి రద్దీని పర్యవేక్షించేందుకు తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుతున్నారు. వి.ఐ.పి దర్శనాల కోసం రూ.1500, రూ.1000, రూ.300 టికెట్లతో ప్రత్యేక క్యూ లైన్లు సిద్ధం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి , ఎండ నుండి రక్షణ కల్పించడానికి పటిష్టమైన షెడ్లు, బారికేడ్లు నిర్మించారు. ముగ్గురు మంత్రుల కమిటీ , జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ మహా ఉత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోంది.
Big Basket : బిగ్ బాస్కెట్ కస్టమర్లకు షాక్.. కుళ్ళిన మాంసం, ఎక్స్పైరీ డేట్ వస్తువుల సరఫరా..!