Reading Time: 2 minutes
IPL 2026 Controversy : డగౌట్‌లో ఫోన్ వాడకం..చిక్కుల్లో రాజస్థాన్.. ఐపీఎల్ రూల్స్ ప్రకారం వైభవ్ కూడా పనిష్మెంట్ తప్పదా ?

IPL 2026 Controversy : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) వరుస విజయాలతో దూసుకుపోతుంటే, మరోవైపు ఒక వివాదం ఆ జట్టును చుట్టుముట్టింది. ఆర్‌సీబీపై జరిగిన మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్‌తో అందరినీ అలరించాడు. అయితే అదే సమయంలో డగౌట్‌లో చోటుచేసుకున్న ఒక దృశ్యం ఇప్పుడు ఐపీఎల్ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీమ్ మేనేజర్ ఫోన్ వాడటం, అది కెమెరాకు చిక్కడంతో నిబంధనల ఉల్లంఘన జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి.

అసలు ఏం జరిగింది?

గత శుక్రవారం గువహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ సాగుతున్న సమయంలో, టీవీ కెమెరా డగౌట్ వైపు మళ్లింది. అక్కడ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ తన మొబైల్ ఫోన్ వాడుతూ కనిపించారు. ఆయన పక్కనే ఉన్న వైభవ్ సూర్యవంశీ కూడా ఆ ఫోన్ వైపు తొంగి చూడటం స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ అవాక్కయ్యారు.

ఐపీఎల్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, యాంటీ కరప్షన్ రూల్స్ ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్ లేదా ఫీల్డ్ ఏరియాలో మొబైల్ ఫోన్లు వాడటం పూర్తిగా నిషేధం. కేవలం టీమ్ అనలిస్ట్ మాత్రమే మ్యాచ్ డేటా కోసం ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ వాడటానికి అనుమతి ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్ ఏరియాలో ఫోన్ వాడవచ్చు కానీ, డగౌట్‌లో వాడటం నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఈ నిబంధన ఆటగాళ్లకు మాత్రమే కాదు, కోచింగ్ స్టాఫ్, మేనేజ్‌మెంట్‌కు కూడా వర్తిస్తుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భారీ జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి.

లలిత్ మోదీ ఆగ్రహం

ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రంగా స్పందించారు. “ఇది అస్సలు ఒప్పుకోలేని విషయం. అసలు యాంటీ కరప్షన్ యూనిట్ ఎక్కడ ఉంది?” అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఈ వీడియోను ఆయన రీట్వీట్ చేయడంతో విషయం ఇంకా పెద్దదయ్యింది. మ్యాచ్ ఫిక్సింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకే ఫోన్లపై నిషేధం విధిస్తారు కాబట్టి, దీన్ని బీసీసీఐ, యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) సీరియస్‌గా తీసుకునే అవకాశం ఉంది.

తదుపరి చర్యలు ఏమిటి?

ప్రస్తుతానికి మ్యాచ్ రెఫరీ, యాంటీ కరప్షన్ అధికారులు ఈ వీడియోను సమీక్షిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే టీమ్ మేనేజర్‌పై లేదా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై భారీ జరిమానా పడే అవకాశం ఉంది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ తన తదుపరి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈలోపు ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒకవైపు విజయాల జోరులో ఉన్న టీమ్‌కు, ఇటువంటి అనవసర వివాదాలు తలనొప్పిగా మారేలా ఉన్నాయి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..