Reading Time: 2 minutes
Dharmana Prasada Rao Warns Of New State Agitation Over Regional Imbalance In Ap

Dharmana Prasada Rao: రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు పెరుగుతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో మరో రాష్ట్రం కోసం ఉద్యమం మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు.. ఇలాంటి పరిస్థితులకు ఎవరూ ఆజ్యం పోయకూడదని ఆయన సూచించారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నవారు కుటుంబానికి తండ్రి లాంటివారని, అందరిని సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుందని ధర్మాన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికే పరిమితమై ఉన్నట్టు కనిపిస్తున్నారని విమర్శించారు. అమరావతిని ప్రజల రాజధానిగా పేర్కొంటున్నారని, కానీ అది నిజంగా ప్రజల రాజధానా అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమ మనసులో వేసుకోవాలని అన్నారు.

Read Also: US Iran War: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. నేడు ఇరాన్‌కు “కాలరాత్రి”గా కానుందా?

తెలంగాణ ఉద్యమానికి కారణమైన అంశాలను ప్రస్తావిస్తూ శ్రీకృష్ణ కమిటీ నివేదికలో నిధుల అసమాన పంపిణీ ప్రధాన కారణమని చెప్పిందని గుర్తు చేశారు. అదే విధంగా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వనరుల పంపిణీపై అసంతృప్తి పెరిగితే మరో ఉద్యమం తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ధర్మాన.. రాజధాని నిర్మాణం పేరుతో ఒక ప్రాంతానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం సరైంది కాదని, అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతిలో సాధారణ ప్రజలకు ఏమి లభిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. పన్నులు కట్టడం తప్ప ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం ఏమిటో స్పష్టం చేయాలని అన్నారు.

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయని, అక్కడ పెద్దగా అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తికాలేదని విమర్శించారు ధర్మాన.. విశాఖలో కనిపించే అభివృద్ధి కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిదేనని, స్థానికులకు పెద్దగా లాభం లేదని అన్నారు. ఇదే సమయంలో, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపాదించిన డిసెంట్రలైజేషన్ విధానాన్ని సమర్థిస్తూ, అది అన్ని ప్రాంతాలకు సమాన అభివృద్ధి కల్పించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. కానీ, ఆ విధానాన్ని విమర్శించడం సరికాదన్నారు. వంశధార ప్రాజెక్ట్ విషయంలో కూడా ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ, దాని కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిందని తెలిపారు. ట్రిబ్యునల్ తీర్పు తమ ప్రభుత్వంలో వచ్చినప్పటికీ, ఇప్పుడు గెజిట్ మాత్రమే వచ్చిన విషయాన్ని కొందరు తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. మొత్తంగా, రాష్ట్ర అభివృద్ధి సమతౌల్యంగా ఉండాలంటే అన్ని ప్రాంతాలకు సమానంగా నిధులు కేటాయించాలని, లేకపోతే ప్రాంతీయ అసంతృప్తి మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు..