Reading Time: < 1 minute
Mp Kadiyam Kavya Demands Paraquat Dichloride Ban Lok Sabha Zero Hour

వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య లోక్‌సభలో పారాక్వాట్ డైక్లోరైడ్ (గడ్డి మందు)పై పూర్తి నిషేధం విధించాలని చేసిన డిమాండ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం పార్లమెంట్ జీరో అవర్‌లో ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ రసాయనం వల్ల పర్యావరణం , మానవ ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాలను వివరించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ కేవలం కలుపు మొక్కలను నివారించే రసాయనం మాత్రమే కాదని, ఇది నేల, నీరు, గాలిని తీవ్రంగా కలుషితం చేస్తోందని ఎంపీ స్పష్టం చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో దీని మితిమీరిన వాడకం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా.. భూగర్భ జలాలు కూడా విషతుల్యం అవుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పరోక్షంగా ఆహారపు గొలుసులోకి చేరి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని హెచ్చరించారు.

ఎంపీ కావ్య ప్రసంగంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడ్డి మందు ఆత్మహత్యలకు ప్రధాన సాధనంగా మారడం. చిన్నపాటి మనస్పర్థలు లేదా క్షణికావేశంలో ఈ రసాయనాన్ని సేవించిన వారు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె పేర్కొన్నారు. పారాక్వాట్ సేవించిన సందర్భాల్లో మరణాల రేటు దాదాపు 100 శాతం ఉండటం అత్యంత భయానకమైన విషయం. దీనికి ఇప్పటివరకు ఎటువంటి విరుగుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఆసుపత్రికి చేరినా ప్రాణాలు కాపాడటం అసాధ్యంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:Hey Balwanth: ఓటీటీలోకి సుహాస్ ‘హే బల్వంత్’ సినిమా.. స్ట్రీమింగ్ ఆ రోజే!

వరంగల్ సహా తెలంగాణలోని అనేక జిల్లాల్లో పారాక్వాట్ వల్ల జరుగుతున్న ప్రాణనష్టాన్ని ఎంపీ వివరించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA), పలువురు వైద్య నిపుణులు కూడా ఈ రసాయనం వల్ల కలిగే ముప్పును గుర్తించి, దీనిపై నిషేధం విధించాలని ఇప్పటికే గళమెత్తారు. ప్రజల ప్రాణాలను కాపాడటం కంటే వేరే ఏదీ ముఖ్యం కాదని, అందుకే కేంద్ర ప్రభుత్వం తక్షణమే దీని తయారీ, అమ్మకాలు , వినియోగంపై సంపూర్ణ నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రమాదకరమైన ఇటువంటి రసాయనాలకు బదులుగా పర్యావరణహితమైన, సురక్షితమైన ప్రత్యామ్నాయాలను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని.. ఈ దిశగా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆమె కోరారు.