Reading Time: 2 minutes
Telangana Student Scooter Scheme 2500 Scholarship 10th Merit Students

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యార్థుల చదువులకు రవాణా ఇబ్బందులు అడ్డుకాకూడదని, అలాగే ప్రతిభ గల విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో విద్యాశాఖ రెండు సరికొత్త పథకాలపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. వచ్చే విద్యా సంవత్సరం నుండి వేల సంఖ్యలో విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం విద్యాశాఖ ఒక వినూత్న ప్రతిపాదనను సిద్ధం చేసింది. ముఖ్యంగా సమాజంలో వెనుకబడిన లేదా శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దివ్యాంగ (Disabled) విద్యార్థులకు, అలాగే ట్రాన్స్‌జెండర్ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. వీరికి ప్రత్యేకంగా రూపొందించిన స్కూటర్లను పంపిణీ చేయడం ద్వారా వారు కళాశాలకు సులభంగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు మెరిట్ సాధించిన విద్యార్థులకు కూడా ఈ స్కూటర్లను అందజేసే ఆలోచనలో విద్యాశాఖ ఉంది.

Also Read:Gas Cylinder: గృహ వినియోగదారులకు శుభవార్త.. కేంద్రం కీలక ప్రకటన

పదో తరగతి మెరిట్ విద్యార్థులకు ఆర్థిక భరోసా..
కేవలం రవాణా సౌకర్యమే కాకుండా.. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతీ ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసి.. మెరిట్ సాధించిన సుమారు 40 వేల మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వీరికి స్కాలర్‌షిప్ కింద ప్రతీ ఏడాది రూ. 2,500 చొప్పున అందించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ నగదు నేరుగా విద్యార్థుల ఉన్నత చదువుల ఖర్చులకు ఉపయోగపడనుంది.

ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ డిగ్రీ , బీటెక్ విద్యార్థినుల కోసం ఒక కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకునే విద్యార్థినులకు ఉచితంగా ‘ఎలక్ట్రిక్ (EV) స్కూటీలు’ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు విద్యాశాఖ ప్రతిపాదించిన కొత్త పథకాలు కూడా దీనికి తోడైతే, ప్రభుత్వ విద్యా సంస్థల పట్ల విద్యార్థుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు పథకాలు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ప్రభుత్వం వీటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల వేల మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది.