Tamil Nadu Elections: విజయ్తో పొత్తుపై పళనిస్వామి కీలక వ్యాఖ్యలు..

Tamil Nadu Elections: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి దేశవ్యాప్తంగా అందరిలో ఆసక్తి ఉంది. ఈసారి ఆ రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా అనుకుంటున్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో పాటు విజయ్కి చెందిన టీవీకే ఈసారి బరిలో నిలిచింది. అయితే, టీవీకేతో ఇతర పార్టీల పొత్తులపై చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాడి కే పళనిస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని ఆయన పూర్తిగా తోసిపుచ్చారు. ఈ పొత్తు కేవలం ప్రచారం, కేవలం మీడియా ఊహాగానాలే అని అన్నారు. తనకు బీజేపీ నేత అన్నామలైతో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. మీడియానే తమ మధ్య చీలకలు సృష్టిస్తోందని ఆరోపించారు. మార్చి 17న కోయంబత్తూరులో జరగనున్న ఒక నిరసన ప్రదర్శనకు, మాజీ తమిళనాడు BJP అధ్యక్షుడు అన్నామలై, అన్నాడీఎంకే నేత ఎస్పీ వేలుమణిలతో కలిసి తాము అధ్యక్షత వహించనున్నామని ఆయన నొక్కి చెప్పారు.
Read Also: Health News: భోజనం తర్వాత మీకు “స్వీట్స్” తినాలని అనిపిస్తోందా.? అయితే, ఇదే కారణం కావచ్చు..
టీవీకే పార్టీ ఎన్డీయే కూటమిలో చేరుతుందా? అని మీడియా ప్రశ్నించినప్పుడు.. : “నేను దీనిపై ఇప్పటికే స్పష్టత ఇచ్చాను. ఇప్పటివరకు, మేము వారితో (టీవీకేతో) ఎటువంటి చర్చలు జరపలేదు. అలాంటప్పుడు, పొత్తు ఎలా కుదురుతుంది? పొత్తు కుదురుతుందని మీడియానే విషయాన్ని పెద్దది చేసి చూపిస్తూ, అనవసరమైన ప్రచారం చేస్తోంది. ఆ పార్టీతో అన్నాడీఎంకేకు ఎటువంటి సంబంధం లేదు, పొత్తు కోసం మేము ఎటువంటి సంప్రదింపులూ జరపలేదు.” అని అన్నారు.
తమిళనాడులో ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే నేతృత్వం వహిస్తుందని, టీటీవీ దినకరన్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల్లో విజయం కోసం ఇద్దరం కలిసి కృషి చేస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు సహజమే అని ఇప్పుడు వాటిని పరిష్కరించుకున్నామని పళనిస్వామి చెప్పారు.