Reading Time: 2 minutes
Telangana Bc Commission 40 Castes Central Obc List Census 2026

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరో 40 బీసీ కులాలను తక్షణమే కేంద్ర ఓబీసీ (OBC) జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. త్వరలో జరగబోయే జనాభా గణన (Census) కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. వచ్చే జనాభా గణనలో భాగంగా తెలంగాణలో ఇళ్ల జాబితా సేకరణ పనులు 2026 మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతాయి. ఆ తర్వాత అసలైన జనాభా లెక్కింపు 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ లోపే కులాల మార్పులు జరగాలని కమిషన్ కోరుతోంది.

Also Read: Holi Cleaning Tips: హోలీ రంగులు మీ ఇంటిని, గోడలను, ఫ్లోరింగ్‌ను మురికిగా మార్చేశాయా? ఇలా చేయండి చాలు..

అసలు సమస్య ఏమిటి..?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం 130 కులాలను బీసీలుగా గుర్తించింది. వీరికి రాష్ట్రస్థాయిలో అన్ని పథకాలు అందుతున్నాయి. కానీ.. కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఓబీసీ జాబితాలో మాత్రం మన రాష్ట్రం నుంచి కేవలం 90 కులాలు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 40 కులాల పేర్లు కేంద్ర జాబితాలో లేవు. అందులో భాగంగానే బీసీ కమిషన్ ఈ సిఫారసులు చేసింది. జనాభా గణనలో ఈ 40 కులాల వారు బీసీలుగా నమోదు కాకపోతే.. రాష్ట్రంలో బీసీల సంఖ్య వాస్తవం కంటే తక్కువగా నమోదయ్యే ప్రమాదం ఉంది. తద్వారా బీసీలకు అందాల్సిన నిధులు, ప్రయోజనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

Also Read: Peddi: హుక్ స్టెప్పులు.. సిక్సర్ ఎలివేషన్లతో బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్!

ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కమిషన్ పలుమార్లు కేంద్రానికి విన్నవించినా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే.. జనాభా గణన ప్రారంభం కాకముందే ఈ 40 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ చైర్మన్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కె. రామకృష్ణారావుకు లేఖ రాశారు.

సాధారణంగా ఒక కులాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలంటే రాష్ట్ర కమిషన్ సిఫార్సు మేరకు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే ఆ కులాల విద్యార్థులకు సెంట్రల్ యూనివర్సిటీల్లో సీట్లు, రైల్వే, బ్యాంకింగ్ వంటి కేంద్ర ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుంది. దీనిపై జాతీయ బీసీ కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.