
పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల సమీపంలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గల్లంతయ్యారు. మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.
కాలువలో గల్లంతైన వారు పోతుల బాను వికాస్ (18), రాజారామ్ (17), నాగిరెడ్డి దుస్వంత్ (18), నాగబత్తుల సాయి సూర్య (19)లుగా గుర్తించారు. వీరంతా నరసాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. స్నేహితుడి సోదరుడి వివాహానికి హాజరయ్యేందుకు వీరంతా ఐతంపూడి ప్రాంతానికి వెళ్లారు. వివాహ కార్యక్రమం ముగించుకుని తమ స్వగ్రామమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామానికి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. మార్గ మధ్యలో ఐతంపూడి లాకుల సమీపంలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
గల్లంతైన యువకుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోతుల బాను వికాస్ మృతదేహం ఐతంపూడి వద్ద లభించగా.. నాగిరెడ్డి దుస్వంత్ సాయి మృతదేహం మార్తేరులోని చించినాడ కాలువలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సాయి సూర్య, రాజారామ్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐతంపూడి లాకుల ప్రాంతంతో పాటు కాలువ పరిసరాల్లో రెస్క్యూ బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి.
స్నేహితుడి కుటుంబంలో వివాహ వేడుకకు వెళ్లిన యువకులు తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదానికి గురవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. యువకులంతా ఇంజనీరింగ్ విద్యార్థులు కావడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎలా అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది, ప్రమాద సమయంలో వాహన వేగం ఎంత ఉంది వంటి అంశాలను పరిశీలిస్తున్నారు.