
దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా శర్మ భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అనేక సంచలన ఆరోపణలు చేసింది. మాజీ న్యాయమూర్తి గిరిబాల సింగ్, ఆమె కుమారుడు సమర్థ్ సింగ్పై వరకట్న వేధింపులతో పాటు ట్విషా శర్మను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా సీబీఐ తన ఛార్జ్షీటులో పేర్కొంది.

33 ఏళ్ల ట్విషా శర్మ మే 12న భోపాల్లోని తన భర్త ఇంట్లో మృతిచెందారు. వివాహం జరిగిన ఐదు నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోయారు. ట్విషా కుటుంబ సభ్యులు ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించారని, అత్తింటివారు తమ పలుకుబడి, అధికారాన్ని ఉపయోగించి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
636 పేజీల ఛార్జ్షీట్
సీబీఐ దాఖలు చేసిన 636 పేజీల ఛార్జ్షీట్లో వరకట్న మరణం, వివాహిత మహిళపై క్రూరత్వం, ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో చేసిన చర్యలకు సంబంధించిన చట్టపరమైన సెక్షన్లు చేర్చింది. ట్విషా మృతి అనంతరం ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తొలుత సమర్థ్ సింగ్ పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో అతడి కోసం గాలింపు చేపట్టారు. అనంతరం మే 22న జబల్పూర్లో అతడిని అరెస్టు చేసి భోపాల్కు తరలించారు. ఆ తర్వాత సీబీఐ కేసు దర్యాప్తును చేపట్టి సమర్థ్ సింగ్ను విచారించింది. అతడి మొబైల్ ఫోన్ వినియోగం, డిజిటల్ కాంటాక్టులు, ట్విషా మృతి సమయంలో జరిగిన పరిణామాలను అధికారులు విశ్లేషించారు.
పోస్టుమార్టం రిపోర్టులో కీలక విషయాలు
ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ముందు సమర్పించిన రికార్డుల ప్రకారం.. ట్విషా శర్మ శరీరంపై ఆరు గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో నమోదైంది. అదే సమయంలో ఆమె మరణానికి కారణం ఉరి వేసుకోవడమేనని పేర్కొన్నారు. అయితే శరీరంపై ఉన్న గాయాలు ఎలా ఏర్పడ్డాయనే దానిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశం దర్యాప్తులో కీలకంగా మారింది. ట్విషా కుటుంబం డిమాండ్ మేరకు రెండోసారి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. అనంతరం వైద్య, ఫోరెన్సిక్ దర్యాప్తును మరింత లోతుగా చేపట్టారు.
జిమ్నాస్టిక్స్ బెల్ట్పై దర్యాప్తు
ఈ కేసు దర్యాప్తులో జిమ్నాస్టిక్స్ బెల్ట్ కూడా కీలక ఆధారంగా మారింది. దాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ట్విషా మృతదేహాన్ని ఉరి నుంచి కిందకు దించడం, బెల్ట్ను విప్పడం వంటి ఘటనలు నిందితులు చెబుతున్న విధంగా వాస్తవంగా సాధ్యమేనా అనే అంశాన్ని సీబీఐ పరిశీలించింది. ఇందులో భాగంగా ట్విషా అత్తమామల ఇంట్లో సీబీఐ అధికారులు క్రైమ్ సీన్ను రీక్రియేట్ చేశారు. నిందితులు వెల్లడించిన ఘటనల క్రమం వాస్తవ పరిస్థితులకు సరిపోతుందా అనే విషయాన్ని పరిశీలించారు.
సుప్రీంకోర్టు జోక్యంతో..
ట్విషా శర్మ మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటోగా పరిగణనలోకి తీసుకుని నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. అప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సిఫార్సు చేసింది. ట్విషా మృతి అనంతరం మూడు రోజుల తర్వాత భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 80(2), 85, 3(5)తో పాటు వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 3, 4 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 80(2) వరకట్న మరణానికి, సెక్షన్ 85 భర్త లేదా అతడి బంధువుల చేత మహిళపై జరిగే క్రూరత్వానికి సంబంధించినవి. సెక్షన్ 3(5) ఉమ్మడి నేరపూరిత ఉద్దేశంతో పలువురు చేసిన చర్యలకు వర్తిస్తుంది.

సీబీఐ తాజాగా దాఖలు చేసిన ఛార్జ్షీట్లో BNS సెక్షన్ 108ను కూడా చేర్చింది. ఈ సెక్షన్ ఆత్మహత్యకు ప్రేరేపించడానికి సంబంధించినది. కేసులో తదుపరి దర్యాప్తు, న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది.