Reading Time: < 1 minute
Amit Shah Sonia Gandhi Vande Mataram Congress 2026

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడిన అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘వందేమాతరం’ గీతం ఆలపిస్తుండగా సోనియాగాంధీ పాట ఆపమని కోరారని అన్నారు. ఈ పాపానికి దేశ ప్రజలు సోనియాగాంధీని ఎన్నటిక క్షమించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 ఏళ్ల తర్వాత కూడా బంకింబాబు రచించిన ఈ అమర గీతానికి మళ్లీ గౌరవం లభిస్తుంటే, అది సోనియాగాంధీకి నచ్చడం లేదని అన్నారు. సోనియా గాంధీ చేసిన పనిని 140 కోట్ల మంది ప్రజలు చూశారని, ఈ పాపానికి ఈ దేశ ప్రజలు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించరని అన్నారు.

‘‘వందేమాతరాన్ని అసంపూర్తిగా వదిలేయాలని ఎవరైనా ఎలా కలగంటారు? కాంగ్రెస్ వాళ్లు సిగ్గుపడాలి వారిలో ఇంకా ఏమైనా సిగ్గు మిగిలి ఉంటే, బంకిం బాబు అమరాత్మకు, దేశ ప్రజలకు చేతులు జోడించి క్షమాపణ చెప్పాలి’’ అని అన్నారు. ఓటు బ్యాంక్ దురాశతో కాంగ్రెస్ వందేమాతరాన్ని మరిచిపోయిందని అమిత్ షా అన్నారు. ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్రమోడీ ఈ గీతానికి పునర్జీవం పోశారని అన్నారు. ఆదివారం, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా, అమిత్ షా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు.