
దశాబ్దాల ఘనమైన చరిత్ర కలిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గత నాలుగున్నర దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రయాణికులకు నిరంతర సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు చెప్పే చారిత్రక ఘట్టం ఆసన్నమైంది. ఒకప్పుడు చిన్న రన్ వే, కేవలం ఒక్క విమానంతో అత్యంత సాధారణంగా ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్, కాలక్రమేణా ఎంతో అభివృద్ధి చెంది అంతర్జాతీయ స్థాయి సర్వీసులు అందించే స్థాయికి ఎదిగింది. నిత్యం విమానాల మోతతో, ప్రయాణికుల రాకపోకలతో, హడావుడితో కిటకిటలాడే ఈ ప్రాంగణంలో ఇకపై పౌర విమానాల శబ్దం, ప్రయాణికుల అలికిడి వినిపించవు.
రేపటి నుంచి సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులన్నింటినీ నూతనంగా అందుబాటులోకి వచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే నిర్వహించనున్నారు. దీంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రయాణికులకు భోగాపురం ఎయిర్పోర్ట్ మాత్రమే ప్రధాన విమానయాన కేంద్రంగా మారనుంది. ఇటు పౌర విమాన సేవలు ముగియడంతో విశాఖ విమానాశ్రయం ఇకపై పూర్తిగా భారత నావికాదళం (ఇండియన్ నేవీ) ఆధ్వర్యంలోనే పనిచేయనుంది. కేవలం రక్షణ రంగానికి చెందిన ప్రాధాన్యతలు, ప్రత్యేక అనుమతులు పొందిన విమానాలకు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.
పౌర సేవల చివరి రోజు కావడంతో విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద విచిత్రమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఏళ్ల తరబడి ఈ ఎయిర్పోర్ట్తో అనుబంధం ఉన్న ప్రయాణికులు, సిబ్బంది ఎంతో ఉద్వేగానికి గురవుతున్నారు. తమ బంధుమిత్రులకు వీడ్కోలు పలుకుతూ, ఇక్కడి అనుభవాలను గుర్తుచేసుకుంటూ పాసింజర్స్ ఎమోషనల్ అవుతున్నారు. దశాబ్దాలుగా ఎన్నో వేల ప్రయాణాలకు, తీపి పలకరింపులకు సాక్షిగా నిలిచిన విశాఖ విమానాశ్రయం పౌర సేవలకు స్వస్తి పలుకుతూ నేటితో చరిత్ర పుటల్లో నిలిచిపోనుంది.