Reading Time: < 1 minute
Belgium Sewer Construction Workers Find Gold Bars Coins

బెల్జియంలోని సింట్-గిల్లిస్-డెండర్మోండేలో ఒక సాధారణ డ్రైనేజీ పైప్‌లైన్ తవ్వకం పనుల్లో నిమగ్నమైన నిర్మాణ కార్మికులకు ఒక అరుదైన నిధి దొరికింది. దాదాపు 9 మిలియన్ యూరోలు (సుమారు రూ. 98 కోట్లు) విలువైన బంగారు బిస్కెట్లు, అరుదైన నాణేల నిల్వ ఈ తవ్వకాలలో బయటపడింది. వేసవి సెలవుల్లో పనికి వచ్చిన 18 ఏళ్ల విద్యార్థి కోబ్ ఈ నిధిని మొదటగా గుర్తించాడు. పైపులు తొలగిస్తుండగా ఏదో మెరుస్తూ కనిపించిందని, మొదట అవి సాధారణ నాణేలు అనుకున్నామని, కానీ పరిశీలిస్తే బంగారు బిస్కెట్లు, పురాతన నాణేలతో ఉన్న పెద్ద సంచిగా తేలిందని అతను తెలిపాడు.

ఈ బంగారు నిధి 19వ శతాబ్దం చివరలో నిర్మించిన ఒక పురాతన భవనం క్రింద ఉన్న ఇటుకల గోడ మధ్య దాచి ఉంచబడి ఉంది. ఈ భవనం గతంలో ప్రముఖ వ్యాపారి థియోఫిలస్ వాన్ అస్చేకి చెందిన ఒక బ్రూవరీగా ఉండేది. ఇక్కడ 1899 నుంచి 1970 వరకు పానీయాల తయారీ జరిగింది. ప్రస్తుతం ఈ చారిత్రక భవనాన్ని ‘CAW ఓస్ట్-విలాండెరెన్’ అనే సామాజిక సంక్షేమ సంస్థ తమ కొత్త ఆఫీసులు, నివాసాల కోసం పునరుద్ధరిస్తోంది. పనులు జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఈ నిధి వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, లభించిన బంగారాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ బంగారం వెనుక ఉన్న చట్టపరమైన హక్కుదారులను గుర్తించడానికి తూర్పు ఫ్లాండర్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది. ఈ బంగారం ఏదైనా నేరంతో సంబంధం ఉన్నదా లేదా దొంగిలించబడిందా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు.

బెల్జియం చట్టాల ప్రకారం.. దొరికిన నిధిపై హక్కు దావా వేయడానికి అసలైన యజమానులకు ఐదేళ్ల సమయం ఉంటుంది. ప్రస్తుతం ఈ నిధిపై నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు, సంక్షేమ సంస్థ, వాన్ అస్చే వారసులు హక్కులు కోరే అవకాశం ఉంది. భారీ మొత్తంలో లభించినందున చట్టపరంగా అధికారులకు అప్పగించామని, భవిష్యత్తులో తమకు ఏదైనా రివార్డు రూపంలో ప్రతిఫలం దక్కుతుందేమో వేచి చూడాలని కార్మికుడు కోబ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.