Reading Time: 2 minutes
Telangana Sir Draft Voter List 73 39 Lakh Names Excluded And Full Details Are

SIR Draft Voter List: తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు ముసాయిదా ఓటర్ జాబితాను విడుదల చేయనుంది. SIR ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా.. గడువులోగా ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించిన 2,64,87,214 మంది పేర్లతో ముసాయిదా ఓటర్ జాబితా రూపొందించనున్నారు.

ఎన్యూమరేషన్‌ ఫారాలను సమర్పించని 73,39,234 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా జాబితాలో చేర్చడం లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. అంటే మొత్తం ఓటర్లలో సుమారు 21.7% మంది పేర్లు ప్రస్తుతం ముసాయిదా జాబితాలో ఉండవు. అయితే వీరి పేర్లు శాశ్వతంగా తొలగించినట్లు కాదని.. తదుపరి విచారణ, అభ్యంతరాల ప్రక్రియకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ముసాయిదా జాబితాలో చోటు దక్కనున్న 2.64 కోట్ల మంది ఓటర్లలో 93 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్లు లేదా గత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్‌ జరగలేదని అధికారులు గుర్తించారు. వీరిని అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించి ఈరోజు నుంచి అక్టోబర్‌ 15 వరకు ఈఆర్‌ఓలు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకోనున్న 93 లక్షల మందిలో 32.36 లక్షల మంది అన్‌మ్యాప్డ్‌ ఓటర్లు ఉన్నారు. మరో 61.4 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలించిన అనంతరం అర్హత ఉన్న ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు.

SIR ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్‌ ఫారంలో 2002 నాటి ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రుల పేర్లు ఉన్న వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ఈ వివరాలను ఇవ్వడంలో విఫలమైన లేదా తప్పుడు వివరాలు నమోదు చేసిన 32.36 లక్షల మంది ఓటర్లను అధికారులు అన్‌మ్యాప్డ్‌ ఓటర్లుగా గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో అవగాహన లోపం కారణంగా 2002 ఓటర్‌ జాబితా వివరాలు నమోదు చేయాల్సిన చోట ప్రస్తుత వివరాలు, ప్రస్తుత వివరాలు ఇవ్వాల్సిన చోట 2002 నాటి వివరాలను నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఓటర్లకు కూడా నోటీసులు జారీ కానున్నాయి.

నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరై ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల పత్రాల్లో ఏదో ఒకదాన్ని ఆధారంగా సమర్పించాల్సి ఉంటుంది. ఓటరు ఇచ్చిన వివరాలు, సమర్పించిన పత్రాలను ఈఆర్‌ఓలు పరిశీలిస్తారు. విచారణ అనంతరం ఈఆర్‌ఓలు సంతృప్తి చెందితే సంబంధిత ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చనున్నారు. అక్టోబర్‌ 19న తుది SIR ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

దీంతో నేటి నుంచి తెలంగాణలో ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, నోటీసులు, విచారణల ప్రక్రియ కీలకంగా మారనుంది. తమ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో ఓటర్లు పరిశీలించుకోవడంతో పాటు.. నోటీసులు అందిన వారు నిర్ణీత గడువులోగా విచారణకు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.