
Himanshi Khurana: పంజాబీ నటి, ‘బిగ్ బాస్ 13’ ఫేమ్ హిమాన్షి ఖురానా తన మునుపటి ప్రేమికుడు ఆసిమ్ రియాజ్ తో బ్రేకప్ గురించి తాజాగా ఒక పాడ్కాస్ట్లో సంచలన విషయాలను పంచుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు గాఢంగా ప్రేమించుకున్న ఈ జంట, విభిన్న మత విశ్వాసాల కారణంగా తమ ప్రేమను త్యాగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మీడియా ఇంటర్యూ లో హిమాన్షి మాట్లాడుతూ.. ఆ బంధంలో ఉన్నప్పుడు మతాన్ని (ఇస్లాం) స్వీకరించాలనే తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదురైందని, తన పుట్టినప్పటి నుండి నమ్ముకున్న హిందూ ధర్మాన్ని, పూజా విధానాలను వదిలేయడం తనకు దేవుడికి ద్రోహం చేసినట్లుగా అనిపించిందని ఎమోషనల్ అయ్యారు. ఆ గందరగోళంలో తన అంతరాత్మను తెలుసుకోవడానికి ఆమె ‘చార్ ధామ్ యాత్ర’, కఠినమైన ‘కిన్నౌర్ కైలాష్’ యాత్రలు చేశానని, చివరకు తన మతాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతోనే ఆసిమ్తో ప్రేమ బంధాన్ని తెంచుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
హిమాన్షి ఇంకా మాట్లాడుతూ.. మంచి సంబంధం అంటే ఇద్దరూ ఒకరినొకరు ఎదగనివ్వడమేనని చెప్పింది. అమ్మాయి సంతోషంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తే ఆమెకు భాగస్వామి మద్దతు ఉందని, అలాగే అబ్బాయి తన కెరీర్లో ఎదుగుతుంటే అతనికి కూడా భాగస్వామి సహకారం ఉందని ఆమె అభిప్రాయపడింది. కలిసొచ్చే సమయం అనేది ముందే సిద్ధంగా ఉండదని, కలిసి ఎదిగే ప్రయత్నమే అసలు బంధాన్ని నిలబెడుతుందని చెప్పింది. అయితే తన గత ప్రేమకథలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని ఆమె వెల్లడించింది. ఆ బంధంలో ఉండగానే తాను సంతోషంగా లేననే భావన తరచూ కలిగేదని, చివరకు అదే తన ఆరోగ్యాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పింది. ఆ సమయంలో తన బరువు 68 కిలోలకు చేరిందని, ఒక చెడ్డ సంబంధం మనిషి రూపాన్ని కూడా మార్చేస్తుందని పేర్కొంది.
హిమాన్షి చెప్పిన ఆరోగ్య సమస్యలు కూడా మరింత ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఆ రిలేషన్ షిప్ లో తనకు థైరాయిడ్, ఆందోళన, డిప్రెషన్ వచ్చాయని తెలిపింది. అధిక రక్తపోటు వల్ల ఒక రోజు విడిచి ఒక రోజు ముక్కు నుంచి రక్తం కారేదని, జుట్టు రాలిపోవడంతో పాటు ముఖంపై సిస్టిక్ మొటిమలు కూడా వచ్చాయని చెప్పింది. పరిస్థితి మరింత దిగజారడంతో గుండె సమస్యల అనుమానంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, అప్పుడే తన జీవితంలో ఏదో తప్పు జరుగుతోందని గ్రహించినట్లు వివరించింది.
అయితే ఈ ఇంటర్వ్యూలో ఎక్కువగా చర్చకు దారితీసిన విషయం మతం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలే. అసిమ్ పేరు ప్రస్తావించకుండా, తనను ఇస్లాం మతంలోకి మారాలని కోరారని చెప్పింది. ఒక రాత్రి తాను చేసే పూజ చేయొద్దని చెప్పిన ఘటన తనను తీవ్రంగా కలవరపెట్టిందని వెల్లడించింది. ఆ క్షణంలోనే తాను దేవుడికి ద్రోహం చేస్తున్నానేమో అన్న భావన కలిగిందని, మరణించిన తర్వాత తనను దహనం చేస్తారా లేక ఖననం చేస్తారా అన్న ప్రశ్న కూడా తన మనసులో మెదిలిందని చెప్పింది. మతం అనేది ప్రతి వ్యక్తి వ్యక్తిగత నిర్ణయమని, దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉండాలని హిమాన్షి స్పష్టం చేసింది. ఇప్పుడు తన జీవితంలోకి వచ్చే వ్యక్తిలో భావోద్వేగ పరిపక్వతనే ఎక్కువగా కోరుకుంటానని చెప్పింది.
బిగ్ బాస్ 13లో మొదలైన హిమాన్షి, అసిమ్ ప్రేమకథ అప్పట్లో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. షో ముగిసిన తర్వాత కూడా కొంతకాలం కలిసి కనిపించిన ఈ జంట, చివరకు వేర్వేరు మతాలు తమ బంధానికి అడ్డుగా నిలిచాయని ప్రకటిస్తూ విడిపోయింది. తాజాగా హిమాన్షి వెల్లడించిన ఈ విషయాలు ఆ ప్రేమకథ వెనుక ఉన్న భావోద్వేగ సంఘర్షణను మరోసారి వెలుగులోకి తెచ్చాయి.