
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ ఆహార కలకలం రేగింది. వైష్ణవి ఎన్క్లేవ్లోని నందిని మిల్క్ సెంటర్పై మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 120 కిలోల కల్తీ పెరుగు, 6 కిలోల కోవా స్వాధీనం చేసుకున్నారు. కల్తీ పదార్థాలను తరలిస్తున్న రామచందర్ అనే వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. తరలింపునకు ఉపయోగించిన టాటా ఏస్ వాహనం సీజ్ చేశారు. తయారీ తేదీ, గడువు తేదీ, లేబుల్స్ లేకుండానే ఆహార పదార్థాల విక్రయిస్తున్నట్లు ఈ తనిఖీల్లో తేలింది.
మిల్క్ పార్లర్లో ఏకంగా 1000 కిలోల పెరుగు, 50 కిలోల కోవా నిల్వలు గుర్తించారు. పెరుగు, కోవా నమూనాలు ఫుడ్ సేఫ్టీ అధికారులకు పోలీసులు పంపారు. పరీక్షల నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. కల్తీ ఆహార తయారీదారులపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఓటీ ఎస్సై సాయికుమార్ హెచ్చరించారు.
ఈ ఘటన మాత్రమే కాదు.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగుళూర్లో కూడా ఇదే తరహా కల్తీ ఫుడ్ వెలుగులోకి వచ్చింది. స్థానిక కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్పై హెచ్-ఫాస్ట్ బృందం, జీహెచ్ఎంసీ ఆహార భద్రతా అధికారులు, టాస్క్ ఫోర్స్, ఆదిభట్ల పోలీసులు శనివారం సంయుక్తంగా దాడి చేశారు. 6 నెలలుగా కాలం చెల్లిన మైదా పిండి, బెల్లం, రసాయన ఫ్లేవర్లతో సోన్ పాపిడి, పల్లి పట్టీలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ దాడిలో రూ.4,07,300 విలువైన 1,560 సోన్ పాపిడి జార్లు, 240 పట్టీల జార్లు, ఎక్స్పైరీ అయిన ముడిపదార్థాలను, 670 కేజీల లేబుల్ లేని బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు ఈ పదార్థాలు కొనుగోలు చేసి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడు మహమ్మద్ ఖలీద్, మేనేజర్ సంతోష్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ముడిపదార్థాలను రాహుల్ తపాడియా అనే వ్యక్తి సప్లై చేస్తున్నట్లు తేల్చారు.
పసి పిల్లలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్త దాకా.. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాకా .. ఇలా ‘కాదేదీ కల్తీకనర్హం’ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినే పచ్చడి, అందులో పోసుకునే నెయ్యి, చిన్నారులు ఇష్టంగా తినే ఐస్క్రీమ్స్, కిరాణా షాపుల్లో దొరికే తినుబండారాలు.. హోటళ్లలో తాగే చాయ్, అందులో ముంచుకు తినే ఉస్మానియా బిస్కెట్స్.. ఇలా ఒక్కటేమిటి సర్వం కల్తీనే.