Reading Time: < 1 minute
Tarique Rahman India Visit Sheikh Hasina Extradition Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ త్వరలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ పర్యటనకు రావాలంటే బంగ్లాదేశ్ ఒక షరతు విధించినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని షేక్ హసీనాను ముందు బంగ్లాదేశ్ తమకు అప్పగించాలని కోరింది. అప్పగింత ప్రక్రియపై భారత్ ముందుకు సాగకపోతే తారిక్ రెహ్మన్ న్యూఢిల్లీ పర్యటన జరిగే అవకాశం లేదని బంగ్లాదేశ్ చెప్పింది. తారిక్ రెహ్మాన్ న్యూఢిల్లీ పర్యటనపై గత కొంత కాలంగా ఇరు దేశాల అధికారులు చర్చిస్తున్నారు.

అయితే, ఆగస్టు 5న న్యూఢిల్లీలో షేక్ హసీనా బహిరంగ మీడియా కార్యక్రమం నిర్వహించడంపై బంగ్లాదేశ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తుందని, ఇది తమ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించింది. దీనికి ప్రతిగా షేక్ హసీనా ప్రెస్‌మీట్‌తో తమకు సంబంధం లేదని భారత్ తేల్చి చెప్పింది.

బంగ్లాదేశ్ షేక్ హసీనాతో పాటు పరారీలో ఉన్న నిందితుల్ని త్వరగా అప్పగించాలని భారత్‌ను కోరామని, రాజకీయ కార్యకర్త షహీద్ షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితులను కూడా ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌కు అప్పగించాలని కోరినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీమ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో సంచలనం సృష్టించిన ఉస్మాన్ హాదీ హంతకుల్ని మార్చిలో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బొంగావ్ సరిహద్దు పట్టణం నుంచి అరెస్టు చేశారు.