
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఓట్లను కాపాడుకోవాలి
- డీసీసీ, పీఏసీలతో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, వెలుగు: అనామలిస్ జాబితాలో ఉన్న ఓట్లను తొలగించకుండా చూసే బాధ్యత బీఎల్ఏలతో పాటు నియోజకవర్గ ఇన్చార్జ్లు, పార్టీ ఎమ్మెల్యేలదే అని ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. సర్ ఫేజ్2లో మరింత అప్రమత్తంగా ఉండి, వీలైనన్ని ఎక్కువ మంది పేర్లను అనామలిస్ నుంచి ఓటర్ల జాబితాలో చేర్చాలని సూచించారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఓట్లను కాపాడే ప్రయత్నం చేయాలన్నారు. ఆదివారం ఇందిరా భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల డీసీసీ, పీఏసీ సమావేశాలు మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగాయి. ఈ మీటింగ్లో మంత్రులు పొన్నం, అజారుద్దీన్, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.
గ్రామ, మండల, డివిజన్ కమిటీలను వెంటనే పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. సంఘటన శ్రీజన్ అభియాన్ ప్రోగ్రామ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సర్ ఫేజ్2 ప్రోగ్రామ్ను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. అది మీ భవిష్యత్తే కాదు పార్టీ భవిష్యత్ను నిర్ధారించేదని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మైనార్టీ ఓట్లను అనామలిస్ జాబితా నుంచి ఓటర్ల జాబితాలో వీలైనన్ని ఎక్కువ మందిని చేర్చాలని సూచించారు. అందుకు సంబంధించిన ఆధారాలను సమకూర్చి బీఎల్వోలకు ఇవ్వాలని, పార్టీని బూత్ లెవెల్లో బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామ్మెహన్ రెడ్డి, మోత రోహిత్, నాంపల్లి ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్, ఖైరతాబాద్ ఇన్చార్జి విజయారెడ్డి పాల్గొన్నారు.