
మేడిపల్లి, వెలుగు: భర్త చేతులు, కాళ్లు కట్టేసి సెంట్రింగ్ కర్రతో కొట్టి చంపి, ప్రమాదంగా చిత్రీకరించిన భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లోని పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ(51) ఈ నెల 6న నైట్ డ్యూటీ చేసి ఇంటికి వచ్చి, మద్యం తాగాడు. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భార్య సునీతతో గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన సునీత అతడిని హత్య చేయాలని నిర్ణయించుకొని, చేతులు, కాళ్లను చీరతో కట్టేసి సెంట్రింగ్ కర్రతో కొట్టడంతో స్పృహ కోల్పోయాడు.
అనంతరం కొడుకు నిఖిత్కు ఫోన్ చేసి వాహనం నుంచి జారి పడి గాయపడ్డాడని చెప్పింది. కుటుంబ సభ్యులు అతడిని బోడుప్పల్లోని ఓ ఆసుపత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్, సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించి అనుమానంతో సునీతను విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మేడిపల్లి పోలీసులు తెలిపారు.