Reading Time: < 1 minute
Draft Sir List Released In Telangana What To Do If Your Vote Is Missing Know Here

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. జూన్ 25 నుంచి ఆగష్టు 10 వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ జాబితాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ముసాయిదా జాబితా విడుదలకు ముందు రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల ఓటర్లు ఉండగా, సర్వే ద్వారా 2,64,87,213 మంది (78.30%) నుంచి ఎన్యుమరేషన్ ఫారాలు సేకరించారు.

పరిశీలనలో 9,22,229 మంది (2.73%) మరణించినట్లు, 57,46,803 మంది (16.99%) శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలిపోవడం వల్ల అధికారులకు అందుబాటులో లేరని గుర్తించారు. అలాగే 6.70 లక్షల (1.98%) మందికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు ఉన్నట్లు తేలింది. సరైన వివరాలు అందించకపోవడంతో 32.2 లక్షల ఓటర్లకు మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి కాలేదు.

ఓటర్ల నమోదు కోసం బూత్ స్థాయి అధికారులు (BLO) ప్రతి ఇంటిని కనీసం 3 సార్లు సందర్శించారు. ప్రక్రియ సౌలభ్యం కోసం 368 కొత్త పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతో మొత్తం కేంద్రాల సంఖ్య 36,353 కి పెరిగింది. సరిగ్గా వివరాలు నమోదు కానటువంటి వారు, 2002 వివరాలతో అనుసంధానం కాని వారికి ERO ల ద్వారా నోటీసులు జారీ చేసి వివరణ కోరనున్నారు. ఆగష్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఓటు కోల్పోయిన వారు, కొత్తగా నమోదు చేసుకునే వారు Form-6 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఓటరు నమోదు, సమాచార సవరణ, ఇతర సేవల కోసం ఎన్నికల కమిషన్ అందిస్తున్న డిజిటల్ పోర్టల్ https://voters.eci.gov.in/ ద్వారా దరఖాస్తులను పరిశీలించుకోవచ్చు.