Reading Time: 2 minutes

రూ.15 లక్షల లంచం తీసుకుంటూ.. CBIకి అడ్డంగా దొరికిన రైల్వే ఇంజినీర్‌ !

Caption of Image.

విజయవాడ: రూ.15 లక్షల లంచం తీసుకుంటున్న రైల్వే ఇంజనీర్‌ను CBI అరెస్ట్‌ చేసింది. బాపిరాజు అనే రైల్వే ఇంజనీర్ సీబీఐకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాపిరాజుతో పాటు బయటి వ్యక్తి అయిన శ్రీచంద్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

పట్టుబడిన ఇద్దరినీ దక్షిణ మధ్య రైల్వే (S.C. Railway), విజయవాడలోని చీఫ్ సిగ్నల్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజనీర్ (CSTE) ప్రాజెక్ట్స్ కార్యాలయానికి చెందిన సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ఒక ప్రైవేట్ వ్యక్తిగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గుర్తించింది.

లంచం డిమాండ్ చేయడం, స్వీకరించడంపై ఆరోపణలకు సంబంధించి, సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ప్రైవేట్ కంపెనీల నలుగురు ప్రతినిధులు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై సీబీఐ ఆగస్ట్ 16న కేసు నమోదు చేసింది.

దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ. 179.50 కోట్ల విలువైన ‘ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్’ పనిని దక్కించుకున్న రెండు ప్రైవేట్ కంపెనీల జాయింట్ వెంచర్, ఆ పనిని గడువు కంటే ముందే పూర్తి చేసినందుకు సుమారు రూ. 7 కోట్ల బోనస్‌ను కోరినట్లు సమాచారం అందింది.

విజయవాడలోని దక్షిణ మధ్య రైల్వే CSTE ప్రాజెక్ట్స్ అధికారులు, ఆ జాయింట్ వెంచర్‌కు అక్రమ ప్రయోజనం చేకూర్చేందుకు బోనస్ ఫైల్‌కు సంబంధించిన తేదీలను తారుమారు చేసి, బోనస్ క్లెయిమ్ ఆమోదానికి సహకరించారని కూడా సీబీఐకి సమాచారం అందింది. విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చే మార్గంలో తన కొడుకు ఈ లంచం మొత్తాన్ని అందజేస్తాడని ఆ ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్.. సదరు సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌కు చెప్పాడు.

సీబీఐ పక్కా ప్లాన్తో సదరు ప్రైవేట్ వ్యక్తి నుంచి రూ. 15 లక్షల లంచం తీసుకుంటుండగా సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌ను రెడ్-హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఆపరేషన్ సమయంలో రూ. 15 లక్షల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన విశాఖపట్నం, విజయవాడ, పిఠాపురం, హైదరాబాద్‌లోని నివాసాలు/కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్నారు.

నిందితులైన సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ప్రైవేట్ వ్యక్తిని ఆగస్ట్ 16న అరెస్టు చేశారు. వీరిని  ఆగస్ట్ 17న విజయవాడలోని సంబంధిత న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

©️ VIL Media Pvt Ltd.