
IND vs SL: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 సైకిల్లో భారత జట్టు ఫైనల్ రేసు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ ఫలితం ఇండియా ఫైనల్ ఆశలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనేది అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం టీమిండియా 48.15 శాతం విజయాల రేటుతో (PCT) ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ సైకిల్లో భారత్కు ఇంకా 9 టెస్టు మ్యాచ్లు మిగిలి ఉండగా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా నేరుగా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ను భారత్ 2–0 తేడాతో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంది. అయితే తొలి టెస్టులో ఊహించని పరాజయం ఎదురైనా ఫైనల్ తలుపులు మాత్రం పూర్తిగా మూసుకుపోవని లెక్కలు చెబుతున్నాయి.
మిగిలిన 9 టెస్టుల్లో 7 విజయాలు తప్పనిసరి:
ఇతర జట్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే భారత్ కనీసం 60 శాతానికి పైగా పాయింట్లను సాధించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాబోయే 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచ్ల్లో విజయం సాధించడం చాలా ముఖ్యం. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఒకవేళ జట్టు ఓడిపోయినప్పటికీ, మిగిలిన 8 మ్యాచ్ల్లో కనీసం 7 విజయాలు సాధించగలిగితే పాయింట్ల శాతాన్ని 60 దాటించి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు.. అంతకంటే తక్కువ పాయింట్లు సాధిస్తే మాత్రం ఇతర జట్ల గెలుపోటముల సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది.
భారత్ ముందున్న సవాలు.. రాబోయే షెడ్యూల్ ఇదే:
డబ్ల్యూటీసీ ఫైనల్ దిశగా భారత జట్టు ప్రయాణం ఏమాత్రం ఈజీ కాదు. శ్రీలంక పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ పూర్తైన తర్వాత, స్వదేశంలో న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత అత్యంత కఠినమైన ఆస్ట్రేలియా పర్యటనలో 5 టెస్టుల ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఎదురుచూస్తోంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లతో తలపడే ముందు శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడం ఇండియాకు చాలా ముఖ్యం. లంకపై 2–0 తేడాతో గెలిస్తే పాయింట్ల శాతం పెరగడమే కాకుండా ప్లేయర్స్ లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక్కడ పాయింట్లు కోల్పోతే ఆస్ట్రేలియా గడ్డపై గెలవాల్సిన ఒత్తిడి భారత్పై బాగా పెరిగిపోతుంది.