
సనత్నగర్లో నూతనంగా నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఆస్పత్రిని జాతికి అంకితం చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ ఆస్పత్రి రూపంలో ఒక అద్భుతమైన ఆణిముత్యాన్ని అందించామని కొనియాడారు. ఆర్ అండ్ బీ, ఆరోగ్య శాఖల అధికారుల కష్టంతోనే ఈ భారీ నిర్మాణాన్ని చాలా వేగంగా పూర్తి చేసుకోగలిగామని తెలిపారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మన దేశంలోని నర్సింగ్ స్టాఫ్ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకోవాలని, తెలంగాణకు చెందిన నర్సింగ్ విద్యార్థినుల సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఎంతో డిమాండ్ ఉందన్నారు. తమ పాలనలో వైద్య రంగంలో ఇప్పటికే 16 వేల మంది నియామకాలు చేపట్టామని.. ఈ వ్యయాన్ని ప్రభుత్వం ఒక ఖర్చులా కాకుండా ప్రజల భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడిగా భావిస్తోందని చెప్పారు.
పేద ప్రజలు అనారోగ్యం పాలైనప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లి తమ ఆస్తులతో పాటు శరీర అవయవాలను కూడా అమ్ముకోవాల్సి వస్తోందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దయనీయ పరిస్థితులను తుడిచిపెట్టడానికే ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ఆస్పత్రుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ (అవయవ మార్పిడి) కోసం ప్రత్యేక విభాగాలను తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ 32 నెలల పాలనా కాలంలో ఆరోగ్యశ్రీ , సీఎమ్ఆర్ఎఫ్ (CMRF) ద్వారా పేదల చికిత్సల కోసం రూ. 5,226 కోట్లు ఖర్చు చేశామని, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కోసం మొత్తం రూ. 21,800 కోట్లకు పైగా కేటాయించామని తెలిపారు. ఆస్పత్రికి వచ్చే పేషెంట్ల అటెండెంట్లకు ఉచిత వసతితో పాటు క్యాంటీన్ సదుపాయం కల్పించే ఆలోచనలో ఉన్నామని వెల్లడించారు.
వైద్య వ్యవస్థలో 60 నుంచి 70 శాతం వైద్య సేవలను నర్సులే అందిస్తారని, మిగిలిన 30 శాతం సేవలను వైద్యులు అందిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, సీఎమ్ఆర్ఎఫ్ కింద పేదలకు మెరుగైన వైద్యం అందించే వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులకే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని, ఆ పరిస్థితిని మార్చి ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే సూపర్ స్పెషాలిటీ వైద్యులకు కూడా మంచి ఇన్సెంటివ్లు ఇచ్చి వారి సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పేద ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై పూర్తి నమ్మకం, విశ్వాసం కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు.
విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తే వారు ఆత్మగౌరవంతో బతుకుతారని, వారికి మనం ప్రత్యేకంగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. సంక్షేమ పథకాలపై భారం తగ్గాలంటే విద్యా వ్యవస్థ పునాదులు బలంగా పడాలని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలపై సీఎం తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. సనత్నగర్ ఎమ్మెల్యే పగటి వేషగాడిలా కేటీఆర్ను తీసుకుని హడావుడి చేశారని ఎద్దేవా చేశారు. గత పాలకులు తమ కుటుంబాల కోసం ఫామ్హౌస్లను వేగంగా నిర్మించుకున్నారు గానీ, పేదల కోసం మొదలుపెట్టిన టిమ్స్ ఆస్పత్రులను పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు తమ బుద్ధి మార్చుకోవాలని, రాష్ట్రంలో కరువు రావాలని పూజలు చేయడం, అబద్ధాల ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినా, సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా వారి తీరు మారలేదన్నారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఇలాగే అబద్ధాలు చెప్తూ ఉండాలని, తాను నిజాలు చెప్తూ ప్రజల్లోకి వెళ్తానని, ప్రతిపక్షాలు ఇలాగే ఉంటే తమకు రాజకీయం మరింత తేలికవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.